ల్యాండ్, స్యాండ్ మాఫియా రాజ్యమేలుతోంది: ఏపీ సర్కారుపై నాదెండ్ల సహా జనసేన నేతల విమర్శలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. జనసేన ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవ సభ తాడేపల్లి మండలంలోని ఇప్పటంలో నిర్వహించారు. దామోదర సంజీవయ్య వేదికగా నామకరణం చేసిన ఈ సభా వేదికపై నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. కరోనా వేళ జన సైనికులు అనేక ప్రాంతాల్లో అందించిన సేవా కార్యక్రమాలు అపూర్వమని అన్నారు.
కోవిడ్ మహమ్మారితో మృతి చెందిన వారికి సభా వేదిక నుంచి సంతాపం ప్రకటించారు నాదెండ్ల మనోహర్. రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల, ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సభను అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. మరో నేత హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్ని మార్చే సామర్థ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే ఉందన్నారు.
రాష్ట్రంలో ల్యాండ్, సాండ్ మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం పవన్ వల్లే సాధ్యమవుతుందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు జనసేన కృషి చేస్తోందని అన్నారు. ఈ ఆవిర్భావ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్, తదితరులు హాజరయ్యారు. పవన్ కళ్యాన్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సభలో జనసేన నేత నాగబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందన్నారు. మళ్లీ జగన్ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. పీకి రాజధాని లేకుండా 3 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి సీఎం జగన్ విమర్శించారు. రైతులు, జనసేన పోరాటం ఫలించి ఏపీకి రాజధాని అమరావతే అయిందన్నారు. ప్రజల పోరాటంతో ఏపీకి అమరావతే రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా ఏపీకి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
జగన్ పాలనలో ఎవరైనా బాగున్నారా? అని నాగబాబు ప్రశ్నించారు. ఏపీ ప్రజలను మిగిలిన రాష్ట్రాల ప్రజలు జాలిగా చూస్తున్నారని తెలిపారు. రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్ను దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందన్నారు. కారులో వెళ్తుంటే పాడెపై మోసుకెళ్లినట్లుందని జనం అంటున్నారని పేర్కొన్నారు. ఏపీలో ప్రతీ పౌరుడిపై లక్ష రూపాయల అప్పు ఉందన్నారు. ప్రజల వెన్నెముక పవన్ కళ్యాణ్ అని అన్నారు. సొంత తమ్ముడైనా.. తనకు పవన్ నాయకుడేనని తెలిపారు. ప్రజల తరపున పోరాడేందుకు పవన్ వచ్చారని తెలిపారు.