నల్ల చున్నీలు తొలగించి బయట పెట్టించారు
అధికార పార్టీ అరాచకాలకు, అన్యాయాలకు ప్రజలు కూడా భయపడుతున్నరాని, రానున్న ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, పులివెందులలో కూడా పరదాలు కట్టుకొని పర్యటన చేసే వ్యక్తి తమ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజలకు కనపడకుండా పాఠశాలలు, కళాశాలల మూయించడం, దుకాణాలు మూయించడం, పరదాలు, బారికేడ్లు పెట్టుకొని పర్యటనలకు రావడం ఎక్కడా చూడని వింత అని ఎద్దేవా చేశారు.
సభకు వచ్చిన మహిళల నల్ల చున్నీలను సైతం బయటపెట్టి రమ్మనమనడం అత్యంత దురదృష్టకరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలు కచ్చితంగా వారిని అవమానించడమేనని, సభకు మహిళలను బలవంతంగా తీసుకువచ్చి, బహిరంగంగా అవమానపర్చిన ముఖ్యమంత్రి వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. వ్యవస్థలను ఉపయోగించుకుంటూ మహిళలను కించపరుస్తూ పాలన చేస్తున్న జగన్ పై తిరగబడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు మహిళలకు క్షమాపణ చెపాల్సిందేనన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, ఉత్తరాంధ్రలో జనసేనను బలోపేతం చేసేలా పటిష్ఠమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామన్నారు. విజయనగరం జిల్లాలోని సమస్యలపై చర్చించేందుకు వారంరోజులపాటు సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు.