ముందు క్షమాపణలు చెప్పు..!! ఏమన్నా ఉంటే తర్వాత చూద్దాం!?
రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి వారిని అయోమయంలోకి పంపించాలనే ఎన్నికల ప్రణాళిక అని మండిపడ్డారు. విశాఖపట్నంలో మనోహర్ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేశారని, హైకోర్టుతో తిట్లు తిన్నవారు కూడా జనసేన పార్టీ వారాహి వాహనం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగానే వాహనం సిద్ధమైందన్నారు. ఏ రంగు వేశారో చూడకుండా, నిబంధనలు పరిశీలించకుండా రవాణాశాఖ అధికారులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి పని చట్టానికి లోబడే ఉంటుందని, వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు.

పవన్ కల్యాణ్ అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను పరామర్శిస్తే వారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు వేసిందని, అలాగే మరోసారి పర్యటిస్తే ఇళ్లు కట్టిస్తుందనే నమ్మకంతో అక్కడి ప్రజలున్నారని, జనసేనపై ప్రజలకు నమ్మకం ఉందనేదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువజనోత్సవాలను నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల తెలిపారు. పవన్ కూడా హాజరవుతారని, యువశక్తి సమాజానికి ఏ విధంగా దోహదపడాలనే అంశంపై వీటిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వారాహి నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని, వైసీపీ నాయకులు అనవసరంగా కంగారుపడాల్సిన అవసరం లేదని మనోహర్ అన్నారు.












Click it and Unblock the Notifications