ప్రత్యేక హోదా కోసం ఆర్కె బీచ్ పోరు: పవన్ కల్యాణ్కు నాగబాబు సై
అర్కె బీచ్లో ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ తలపెట్టిన పోరుకు మెగా హీరోలు ఇప్పటికే మద్దతు తెలిపారు. తాజాగా నాగాబాబు పవన్ పోరుకు సయ్యన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు విశాఖపట్నం రామకృష్ణాపురం (ఆర్కె) బీచ్లో యువత తలపెట్టిన పోరుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడాన్ని ఆయన సోదరుడు, సినీ నటుడు నాగబాబు సయ్యన్నారు. హోదా కోసం జరిగే పోరుకు పవన్ మద్దతు తెలపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ గురించి మెగా హీరోల వేడుకల్లో అభిమానులు అడిగిన ప్రతిసారీ నాగబాబు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే, నాగబాబు హోదాపై జరుగుతున్న పవన్ ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఆ హక్కు కోసం పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు, ఇతర రాజకీయ పార్టీలకు, ఆంధ్రా యూనివర్సిటీ జేఏసీ స్టూడెంట్స్కు, మెగా ఫ్యాన్స్కు, పవన్ ఫ్యాన్స్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
పవన్ కల్యాణ్ ఆదర్శాలతో, అతని ఆలోచనా విధానంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు నాగబాబు చెప్పారు.. విశాఖ ఆర్కే బీచ్లో 26న జరగబోయే శాంతి ర్యాలీకి తన మద్దతు ఉంటుందని నాగబాబు చెప్పారు.
ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ యువత ఆందోళన చేపట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్లో జరగబోయే ఆందోళన కార్యక్రమానికి ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి చాలామంది హీరోలు మద్దతు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఆందోళనను తన చేతుల మీదుగా నడపాలని అనుకుంటున్నట్లు పరిణామాలు గమనిస్తుంటే తెలుస్తోంది. వరుస ట్వీట్స్తో ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ వస్తున్నారు.