viral video: కూతకు వెళ్లిన ఎమ్మెల్యే రోజా: కబడ్డీ ఆడుతూ సందడి
హైదరాబాద్: ఎప్పుడూ రాజకీయాలు, టీవీ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆదివారం సరదాగా కబడ్డీ ఆడారు. విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి.. వారందర్నీ ఉత్సాహపరిచారు.
కబడ్డీ ఆట ప్రారంభించి..
వివరాల్లోకి వెళితే.. నిండ్రలో అంబేద్కర్ సెలెక్ట్ 7వ సంవత్సరం కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు ఆర్కే రోజా. ఈ సందర్భంగా కబడ్డీ ఆడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాగా, రెండు మున్సిపాలిటీలు గల నియోజకవర్గంగా ఉన్న నగరిలో రోజా స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
రంగంలోకి దూకిన రోజా
నిండ్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన అంబేద్కర్ సెలక్ట్ 7వ సంవత్సరం కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించడానికి ఆదివారం ఉదయం విచ్చేశారు రోజా. అయితే, తిరువేలంగాడు - రేణిగుంటల మధ్య రసవత్తర పోరు జరుగుతున్న సమయంలో రోజా రంగంలోకి దూకారు.
కబడ్డీ కబడ్డీ అంటూ..
ఒకసారి రేణిగుంట తరపు నుంచి, మరోసారి తిరువేలంగాడు జట్ల తరపు నుంచి కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లసాన్ని కలిగిస్తాయన్నారు. కబడ్డీ మనదేశపు క్రీడ అని, క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని రోజా తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో రోజా
నగరి మున్సిపాలిటీలోని, 14, 15, 22వ వార్డులలో నగరినియోజకవర్గ శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరి మునిసిపాలిటీలోని 14 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బి.డి.భాస్కర్, 15వ వార్డులో పోటీ చేస్తున్న వి.కె. శ్రీనివాసన్, 22వ వార్డులో పోటీ చేస్తున్న భూపాలన్ విజయం కోసం ఓట్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధి పనులు..
వడమాలపేట మండలం కామాలవారి కండ్రిగ లో రోడ్డు నిర్మాణానికి నగరి శాసనసభ్యురాలు రోజా ఆదివారం శంకుస్థాపన చేశారు. కుప్పం బాదూరు రోడ్డు నుండి కామాలవారి కండిగ వరకు సి.సి రోడ్డు నిర్మాణాన్ని 31.60 లక్షల రూపాయలతో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నాయకులు సదాశివయ్య, సురేష్, కరుణాకర చౌదరి, తులసిరామరాజు, మునీంద్ర, దొరస్వామి, నందయ్య, దర్మయ్య, ముని, లోకేష్, కిరణ్, గాంధీ సుబ్రహ్మణ్యం యాదవ్, రంగనాథం, మహేష్, రమేష్, , వెంకటరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, మదనమోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రవి, లలిత్ కుమార్, యాదవేంద్ర పరందామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.