అమ్మను బాధగా, నాన్నను హాయిగా: ఏడ్చేసిన నాగార్జున
హైదరాబాద్: అమ్మను బాధతో పంపిస్తే, నాన్నను హాయిగా పంపించామని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. చివరి సమయంలో అమ్మ పడిన బాధ చెప్పనలవి కానిదని, ఒకానొక దశలో ఆమె తనను తానే మరిచిపోయిందని ఆమె అన్నారు. అలాంటివారి కోసం పాలియేటివ్ కేర్ సేవలు ఉంటాయని అప్పట్లో ఎవరూ చెప్పలేదని అన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ సదస్సును శుక్రవారం ఆయన హెచ్ఐసీసీలో ప్రారంభించారు. కేన్సర్, ఇతర వ్యాధులతో బాధపడేవారిని ఆఖరి దశలో ఆదుకునే పాలియేటివ్ కేర్ ఆవశ్యకత చాలా ఉందని చెప్పారు.
అనారోగ్యంతో అమ్మ ఏడేళ్లు బాధపడిందని, చివరి ఆరునెలలూ ఆమె పడిన బాధ తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. అప్పుడు పాలియేటివ్ కేర్ గురించి వైద్యులెవరూ చెప్పలేదని కంటతడి పెట్టారు. చికిత్సలతో ఆమె భరించలేని నొప్పులు అనుభవించిందని, ఒకానొక దశలో ఆమె 30 ఏళ్ల క్రితం నాన్నతో మద్రాసులో గడిపిన రోజులను తలచుకుని తనలో తానే మాట్లాడుకునేదని చెబుతూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.

కానీ నాన్నకు బాధ అంటూ ఏంటో తెలియకుండా చూసుకున్నామని, ఆయన ముఖంలో సంతోషం తగ్గకుండా పంపించామని నాగార్జున చెప్పారు. పాలియేటివ్ కేర్ గురించి తెలియడంతో ఆయనకు ఆ సేవలను అందించామని వెల్లడించారు. నాన్న సెట్లో ఉన్నప్పుడు కడుపులో నొప్పి రావడంతో ఎసిడిటీ అనుకున్నామని అన్నారు. వైద్యులకు చూపిస్తే కేన్సర్ అని తెలిసిందని, అప్పుడు డాక్టర్ పాలియేటివ్ కేర్ గురించి తమకు చెప్పారని నాగార్జున అన్నారు.
ఆఖరి నిమిషం, ఆఖరి క్షణంలో హాయిగా, ప్రశాంతంగా చనిపోవాలని భావించామని చెబుతూ అలాంటి వాతావరణం, సేవలు అందే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. రోగులకు చివరి దశలో మంచి వాతావరణం, ఆత్మీయతను పంచే సదుపాయాలను కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా చెప్పారు.












Click it and Unblock the Notifications