Nagarjunasagar Dam: సీఆర్పీఎఫ్ దళాల పహారాలో డ్యామ్; కేంద్ర హోంశాఖ నిర్ణయం!!
నాగార్జునసాగర్ జల జగడం చిలికి చిలికి గాలి వానగా మారుతుంది. ఇప్పటికే నాగార్జునసాగర్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పట్టిన పట్టు వదలకుండా భీష్మించుకు కూర్చోవడంతో ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టిసారించింది. నాగార్జునసాగర్ జలాల విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.
దీంతో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో శుక్రవారం కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ, నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు అప్పగించాలని సూచించారు.

అంతేకాదు సిఆర్పిఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రతిపాదించారు .ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. నవంబర్ 29వ తేదీ రాత్రి ఏపీకి చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం పైకి వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ డ్యాం యొక్క 5, 7 గేట్లు తెరిచి, దాదాపు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, తెలంగాణ సిఎస్ శాంతకుమారి కేంద్ర హోం శాఖకు వెల్లడించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఈ చర్య సమస్యను సృష్టించిందని ఆమె పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ఈ తరహాలో అతిక్రమణలకు పాల్పడడం ఇది రెండవసారి అని శాంత కుమారి స్పష్టం చేశారు. ఏపీ చేసిన ఈ పనితో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన రెండు కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని ఆమె వెల్లడించారు. 2014 నుంచి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్ కో ని కొనసాగించాలని తెలంగాణ cs శాంతకుమారి కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications