వైసీపీ కేసు: 'ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్!
హైదరాబాద్: వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పరువు నష్టం కేసులో పదేపదే కోర్టుకు గైర్హాజరు అవుతున్న 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఎండీ రాధాకృష్ణపై మంగళవారం నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది.
వక్రీకరించారా?: ఆంధ్రజ్యోతి ఆర్కేకు షాక్.. వచ్చి తీరాల్సిందేనన్న హైకోర్టు..
గతంలో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు, 'ఆంధ్రజ్యోతి' పత్రిక తప్పుడు కథనాలు రాసిందన్నది ఆళ్ల అభియోగం. ఈ కథనాలపై ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా, ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది.
ఈ కేసులో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ కె.శ్రీనివాస్ సహా మరికొందరు నిందితులు ఉన్నారు. కేసు విచారణలో తనకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సోమవారం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దానిని తోసిపుచ్చింది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టుకు రాలేకపోతున్నామంటూ రాధాకృష్ణ క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే హైకోర్టు దీన్ని తప్పుపట్టింది. డిసెంబర్ 5న నాంపల్లి కోర్టులో జరగనున్న తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఆదేశించింది.
మరోవైపు ఈ కేసులో నిందితులు గైర్హాజరు అవుతుండడంపై నాంపల్లి కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులందరూ కోర్టుకు హాజరై ఒక్కొక్కరూ రూ. 10 వేల పూచీకత్తును చెల్లించాలని ఆదేశించింది.
'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఎండీ రాధాకృష్ణ వరుసగా కోర్టుకు గైర్హాజరు అవుతుండటంపై నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేశారు.