'పొలిటికల్' అన్ స్టాపబుల్-2?
కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 కార్యక్రమం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వారం వారం ఊహించని అతిథులతో, కాంబినేషన్స్ తో కార్యక్రమాన్ని బాలయ్య బాగా రక్తి కట్టిస్తున్నారు. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ఈ షో సినిమా రంగంలోని నిపుణులతోపాటు రాజకీయ రంగంలోని నిపుణులను కూడా ఇంటర్వ్యూ చేస్తోంది.

పవన్ కల్యాణ్ హాజరు
తాజాగా పవన్ కల్యాణ్ షో కి హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో అటు బాలకృష్ణ, ఇటు వపన్ కల్యాణ్ అభిమానులతో స్టూడియో హోరెత్తిపోయింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లబోతోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి కలయిక హాట్ న్యూస్ గా మారింది. గతంలో ఒకటి, రెండు సందర్భాలు మినహా బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కలుసుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో రాజకీయ రంగానికి వేదికగా మారిన అన్ స్టాపబుల్-2కి గెస్ట్ గా పవన్ రావడంతో మరోసారి రాజకీయం వేడెక్కింది.

మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబు
రెండోసీజన్ మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబును, ఆయన తనయుడు లోకేష్ ను తీసుకువచ్చారు. ఇది అతిపెద్ద సంచలనంగా నమోదైంది. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, తర్వాత జయప్రద, జయసుధ... ఇలా మధ్యలో యువనటులు వచ్చినప్పటికీ రెండో సీజన్ మాత్రం పొలిటికల్ ఎపిసోడ్ గా మారింది. పవన్ కు ముందే ప్రభాస్, గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేశారు. ప్రభాస్ ను షోకు ఆహ్వానించడంద్వారా ఏపీలో క్షత్రియ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే వ్యూహం కనపడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పొత్తుల వార్తలకు బలం
తాజాగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించడంద్వారా పొత్తుల వార్తలకు మరోసారి బలం చేకూరినట్లైంది. అయితే ఈ షోలో పవన్ కల్యాణ్ ను ఏయే విషయాలమీద బాలకృష్ణ ప్రశ్నించారు అనే విషయాలు మాత్రం ప్రోమో విడుదలైన తర్వాతే బయటకు రాబోతున్నాయి. బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాజకీయం చేసేలా చాలా తెలివిగా ఉపయోగిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ బాలకృష్ణ కూడా పరిణతి చెందిన రాజకీయవేత్తలా వ్యవహరిస్తున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications