తిరుమల వెంకన్న అంటే ఆయనకు ఎంతో గురి...హరికృష్ణకు కాంగ్రెస్ మహిళలు ఘన నివాళి
తిరుమల:తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే నందమూరి హరికృష్ణకు మహాభక్తి. అందుకే దశాబ్దాల క్రితం నుంచి 2013 వరకు ఆయన చాలా తరచుగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుండేవారు.
అయితే తన రాక వల్ల ఆలయంలో ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఆయన తక్కువ సమయంలో స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చేసేవారని అక్కడి సిబ్బందిలో సీనియర్లు గుర్తుచేసుకుంటున్నారు. ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి, నూతన ఏడాది ప్రారంభదినాల్లో ఆయన తప్పనిసరిగా తిరుమలకు రావటం ఆనవాయితీగా పాటించేవారు.

స్వామి వారి దేవాలయనికి విచ్చేసిన సందర్భంగా ప్రతిసారి ఆలయ అధికారులతో మాట్లాడి భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకోవటంతో పాటు పలు సూచనలు చేసేవారు. ఏటా ఒకటి- రెండు పర్యాయాలు తిరుమలకు వచ్చే ఆయన 2014లో కుమారుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత మళ్లీ తిరుమలకు రాలేదని తెలుస్తోంది.
అయితే ఆ తరువాత మళ్లీ ఒకే ఒక్కసారి ఆయన తిరుమల దేవస్థానానికి వచ్చారని చెబుతున్నారు. 2015 అక్టోబరు 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ అన్నప్రాసన రోజున కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన ఆ రోజు చాలా ఎక్కువ సమయమే ఆలయంలో గడిపారని తెలిపారు. ఆయన ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లడం అదే చివరిసారి.
ఇదిలావుండగా మాజీ మంత్రి నందమూరి హరికృష్ణకు తిరుపతిలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కొర్లగుంటలో హరికృష్ణ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్.శ్రీదేవి పుష్పాంజలి ఘటించారు. హరికృష్ణ శ్రీవారి భక్తుడని, నిజాయితీగల నాయకుడని వారు కొనియాడారు.












Click it and Unblock the Notifications