రాజ్యసభ టికెట్: రంగంలోకి లోకేశ్, నందమూరి హరికృష్ణకు నిరాశేనా?
హైదరాబాద్: టీడీపీ నేత నందమూరి హరికృష్ణకు ఈసారి రాజ్యసభ సీటు విషయంలో నిరాశే మిగలనుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న హరికృష్ణ వచ్చే ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు సమాచారం.
హరికృష్ణకు రాజ్యసభ టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. దీంతో నారా, నందమూరి కుటుంబాల మధ్య విబేధాలు మళ్లీ బయటపడతాయా? అంటూ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోన్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ మొదటిసారిగా 2008 ఏప్రిల్లో రాజ్యసభకు ఎంపికయ్యారు.
అయితే 2014 సాధారణ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం పార్లమెంట్లో చర్చకు వచ్చిన సందర్భంగా సమైక్యాంధ్ర కోరుతూ హరికృష్ణ 2013 ఆగస్టులో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే తన పదవీ కాలం ముగియడానికి ఏడు నెలల ఉండగానే రాజీనామా చేయడం విశేషం.
2016 జూన్ 21 నాటికి ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రులు వైఎస్ చౌదరి (సుజనా చౌదరి) (టీడీపీ), నిర్మలా సీతారామన్ (బీజేపీ), కాంగ్రెస్కు చెందిన జైరాం రమేష్, జేడీ శీలం పదవీ కాలం పూర్తికానుంది.
వీరిలో సుజనా చౌదరికి చంద్రబాబు కుమారుడు లోకేశ్ అండదండలు ఉన్నాయి. దీంతో సుజనాకు మరోసారి రాజ్యసభ టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక నిర్మలా సీతారామన్ 2014 రాజ్యసభ ఉపఎన్నికలో ఎన్నికయ్యారు. రెండేళ్లపాటే సభ్యురాలిగా ఉన్నందున బీజేపీ జాతీయ నాయకత్వం ఆమెకు మరోసారి అవకాశం కల్పించనుంది.
ఇక ఏపీ శాసనసభలో కాంగ్రెస్కు ప్రాతినిథ్యం లేకపోవడంతో ఆ పార్టీ నుంచి ఎన్నికైన జైరాం రమేష్, జేడీ శీలంకు ఛాన్స్ లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలను బట్టి చూస్తే, ఖాళీ అయ్యే మొత్తం నాలుగు స్థానాల్లో మూడింటిని టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలు సాధించుకునే అవకాశం ఉండగా మరో స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలుగుతుంది.
బీజేపీ అభ్యర్థి నిర్మలా సీతారామన్తో పాటు సుజనా చౌదరి పేర్లు దాదాపు ఖాయమైన నేపథ్యంలో మరో స్థానం మాత్రమే టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో రాజ్యసభ టికెట్ తనకే వస్తుందని హరికృష్ణ ఎంతో నమ్మకంతో ఉన్నా ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ అంతా పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కనుసన్నల్లోనే కొనసాగుతోందని సమాచారం. పిల్లనిచ్చిన మామ, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే హిందుపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఒకే కుటుంబం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వరని తెలుస్తోంది.