అవేవీ లేవనే జగన్ను నమ్మొచ్చా, తెలంగాణలోనే జరగలేదు: చంద్రబాబు
కర్నూలు: వాళ్లకు అభివృద్ధి అవసరం లేదని, డబ్బు సంపాదనే ధ్యేయంగా కనబడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. శనివారం నంద్యాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ను ఉద్దేశించి ఆ విధంగా వ్యాఖ్యానించారు.
ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస జగన్కు ఏమాత్రం లేదని ఆయన అన్నారు. డ్వాక్రా, దీపం పథకాలు నా మానస పుత్రికలని, దీపం పథకాన్ని కాంగ్రెస్ ఆర్పేసిందని, డ్వాక్రా మహిళలకు రూ.6వేల చొప్పున ఇచ్చామని, త్వరలో మిగిలిన సొమ్మునూ అందజేస్తామని ఆయన చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దొంగ బిల్లులు పెట్టి డబ్బు కాజేశారని ఆయన ఆరోపించారు. వైఎస్ హయాంలో రూ.200 మాత్రమే పెన్షన్ ఇవ్వగా, ఆదాయం లేకపోయినా ఇప్పుడు రూ.1000 పెన్షన్ ఇస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని చెప్పారు.
ఎప్పుడో నిర్ణయించారు..
నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుపును ప్రజలు ఎప్పడో నిర్ణయించారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ అభ్యర్ధి బ్రహానందారెడ్డి అధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు. టీడీపీ హయాంలోనే నంద్యాలలో అభివృద్ధి జరిగిందని, నంద్యాలను సుందర పట్టణంగా మారుస్తామని చంద్రబాబు అన్నారు.
అందుకే భూమా వచ్చారు...
నంద్యాల అభివృద్ధి కోసమే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చారని చంద్రబాబు అన్నారు. నంద్యాల ఉపఎన్నికలో గెలుపుకు కృషి చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డికి, అఖిలప్రియకి, ఫరూక్కి, గ్రామ కమిటీ నాయకులకు, సహచర మంత్రి వర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు..
లాంఛనంగానే వచ్చా...
బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయాలని లాంఛనంగా కోరడానికి వచ్చానని చంద్రబాబు చెప్పారు. బ్రహ్మానందరెడ్డి అఖండ మెజార్టీతో గెలుస్తున్నారు, గెలిచారని, అందులో అనుమానం లేదని అన్నారు. నంద్యాల ఒక చరిత్ర కలిగిన నియోజకవర్గమని ప్రశాంతమైన నియోజకవర్గం నంద్యాల అని, అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజానీకం కలిగిన నియోజకవర్గం నంద్యాల అని అన్నారు.
ఏదైనా జరిగిందంటే...
ఏదైనా నంద్యాలలో అభివృద్ధి జరిగిందంటే టీడీపీ హయాంలోనే జరిగిందని చంద్రబాబు అన్నారు. ఫరూక్ మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా నంద్యాలను అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టానని అన్నారు. నంద్యాలలో ఇరుకు రోడ్లు, మురుగునీరు సమస్య, ఇళ్లు లేవని భూమా నాగిరెడ్డి చెబితే.. ఆనాడే హామీ ఇచ్చినట్లు తెలిపారు.
భూమా చివరి కోరిక అదే...
భూమా నాగిరెడ్డి ఆఖరి కోరిక కూడా నంద్యాల అభివృద్ధేనని చంద్రబాబు చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందా? అని అడిగారు. ఒక్క నాడు కూడా నంద్యాల అభివృద్ధి గురించి అడగని వ్యక్తి ఇవాళ నంద్యాలలో పోటీ చేస్తున్నాడని విమర్శించారు.
ప్రయాణం ఇలా ప్రారంభం....
16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో రాష్ట్ర ప్రయాణం మొదలైందని చంద్రబాబు అన్నారు. ఆదాయం బాగున్నప్పటికీ నంద్యాలలో అభివృద్ధి జరగలేదని అన్నారు. టీవీ, పేపర్, డబ్బులు లేవని చెబుతున్న వ్యక్తిని మనం నమ్మొచ్చా అని అడిగారు. రాష్ట్ర ప్రజల కోసమే కష్టపడుతున్నానని చెప్పారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం 24వేల కోట్లు మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని చెప్పారు.
తెలంగాణలో జరగలేదు....
మిగులు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థాయిలో రుణమాఫీ జరగలేదని చంద్రబాబు చెప్పారు. తాను రైతు బిడ్డను కాబట్టి.. రైతుల మీద ఉన్న ప్రేమతో రుణమాఫీ చేశానని చెప్పారు. రాష్ట్రంలో సాగునీరు కోసం అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నానని, మూడు నెలల్లో 28 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని, పోలవరం రాష్ట్రానికి ఓ వరమని, పట్టిసీమను ఏడాదిలో పూర్తిచేశామని చెప్పారు.
పచ్చగా మారుస్తాం...
మచ్చుమర్రిని కూడా పూర్తి చేసి రాయలసీమను పచ్చగా మారుస్తామని ఒకప్పుడు జలయజ్ఞం, ధనయజ్ఞంగా మారిందని, కాంగ్రెస్ పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడే చేస్తుందని అన్నారు. నంద్యాలను స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస జగన్కు లేదని అన్నారు. శ్రీశైలం నీటిని రాయలసీమకు కేటాయిస్తున్నామని, అలా చేయడం వల్లే పోయిన ఏడాది తాగునీటికి నీటిని వదలగలిగామని అన్నారు.
కాల్చక్కర్లేదు.. ఉరేయక్కర్లేదు....
మనం వారిని కాల్చనక్కర్లేదు... ఉరేయక్కర్లేదు... ఓటుతోనే ఖతం చేయాలని చంద్రబాబు వైసిపిని ఉద్దేశించి అన్నారు. వారి అడ్రస్ గల్లంతవడం ఖాయమని అన్నారు. గతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ విధంగా స్పందించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తనను కాల్చాలంటున్నారని, ప్రజలకు మంచి చేస్తున్నందుకే తన బట్టలు ఊడదీస్తారా అని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని, విపక్ష నేత వాఖ్యలు బాధ కలిగించాయని ఆయన అన్నారు. కాల్చి చంపాలని పిల్లలకు నేర్పిస్తే భవిష్యత్లో వారేమవుతారో ఆలోచించాలన్నారు. ఓటు అనేది ఓ ఆయుధం, అది ప్రజల్లో చేతుల్లో ఉంది, దీనితోనే వారిని ఖతం చేయాలని ఆయన అన్నారు.
భూములను కాజేశారు...
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న శిల్పా మోహన్రెడ్డి మార్కెట్ భూములను కాజేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. శోభా నాగిరెడ్డి చనిపోయినప్పుడు ఆళ్లగడ్డలో తాము పోటీ చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం నంద్యాలలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
అమరావతి నుంచే...
రాజధాని అమరావతిలో కూర్చుని అక్కడి నుంచే నంద్యాలలో బల్బులు వెలిగాయా, లేదా అనేది చూస్తున్నానని చంద్రబాబు అన్నారు. సెన్సార్లతో అలాంటి టెక్నాలజీని అభివృద్ది చేశానని ఆయన చెప్పారు. హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది కూడా తానే అని చెబుకున్నారు. అదే తరహాలో, అంతే అద్భుతంగా నంద్యాలను ముందుకు తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు.