మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నన్నపనేని: సీఎం ఆఫీసుకు సందర్శకుల తాకిడి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది.
కమిషన్లో మరో ఐదారుగురు సభ్యులను తర్వాత నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అధ్యక్షురాలు, సభ్యులు బాద్యతలు చేపట్టినప్పటి నుంచి ఐదేళ్లపాటు ఈ పదవుల్లో ఉంటారని స్పష్టం చేసింది. ఏపీ మహిళా కమిషన్ 1998 చట్టం 9వ నిబంధన ప్రకారం ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
సిఎం క్యాంప్ ఆఫీసుకు సందర్శకుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి బుధవారం సందర్శకుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చారు.
గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం లక్ష్మీపురం నుంచి వచ్చిన మహేశ్వర రెడ్డి బ్రెయిన్ ఫీవర్తో బాధపడుతున్నాడు. సకాలంలో చికిత్స లభించకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని అతడి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి మహేశ్వర రెడ్డి వైద్య చికిత్సకు రూ.3 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మారువాడ గ్రామానికి చెందిన దొరస్వామి (23) అనే యువకుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అతడి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి రూ.2 లక్షలు మంజూరు చేశారు.
కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని భావన్నారాయణపురం గ్రామం నుంచి వచ్చిన బి లక్ష్మీదేవి, సుబ్బమ్మలు పేదరికంతో కుటుంబం గడవని పరిస్థితి ఉందని విన్నవించారు. వారికి రూ.25 వేల రూపాయలు అందించాలని సిఎం అధికారులకు సూచనలిచ్చారు.