గోదావరి బాధితులకు ఎన్డీఆర్ ట్రస్ట్ సాయం-ఎవరూ ఆకలితో ఉండొద్దన్న నారా భువనేశ్వరి
ఏపీలో గోదావరి పరివాహక ప్రాంతాల్ని వరదలు ముంచెత్తాయి. వేలాది మంది ఈ వరదలతో నిరాశ్రయులయ్యారు. వీరికి సాయం చేసే విషయంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా వేల సంఖ్యలో జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్టు కూడా రంగంలోకి దిగింది.
కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేలా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగు నీరు, మందులు సహా ఇతర వస్తువుల్ని సరఫరా చేసే కార్యక్రమం ఇవాళ ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. అందుకు అవసరమైన మేర సరుకుల్ని ఇప్పటికే ఆయా ప్రాంతాలకు తరలించి అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాల అమలుపై ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఈవో రాజేంద్రప్రసాద్ సమీక్షించారు.

ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయ సహకారాలు అందించడమే తమ ధ్యేయమని, ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే తమ సిద్దాంతమని భువనేశ్వరి తెలిపారు. గోదావరి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 8వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, మందులు, పిల్లలకు పాలు అందించామన్నారు. అదే స్ఫూర్తితో మిగిలిన వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్కర సమయాల్లో ప్రజలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుందని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఓ దఫా పర్యటించిన ఆమె భర్త, టీడీపీ అధినేత చంద్రబాబు.. రేపటి నుంచో రెండోదఫా పర్యటనకు సిద్ధమయ్యారు.













Click it and Unblock the Notifications