ప్రజల్లోకి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి?
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్ పై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, వారిని తప్పుడు కేసులో ఇరికించి వేధిస్తోందని, గడిచిన 24 గంటలుగా ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారని న్యాయం మీరే చెప్పాలని ప్రజల వద్దకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ ప్రజల్లోకి వెళ్లే అంశంపై ఇప్పటికే పార్టీలో ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడే సమయంలో సీఐడీ చీఫ్ సంజయ్ నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు పరోక్షంగా చెప్పారు. ప్రతిపక్ష నేతలను ఎన్నికల సంవత్సరంలో అరెస్ట్ చేయడం సాధారణంగా జరగవు. వారిపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమైతే తమకు నష్టం చేస్తుందని అధికార పార్టీ ఆలోచిస్తుంది.

రాజకీయాల్లో సానుభూతిని మించిన అస్త్రం ఏదీ ఉండదు. వైఎస్ మరణించిన తర్వాత సానుభూతి అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు వెల్లువలా వచ్చింది. అలాగే ప్రస్తుతం సానుభూతిని ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోయినప్పటికీ జగన్ ఒక్క ఛాన్స్ అని అడగడంతో ప్రజలు ఇచ్చారని, అదే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతోపాటు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి వేధిస్తున్నారంటూ వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కితే సానుభూతి వెల్లువలా వస్తుందంటున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తోందని, ఎన్నికల సమయానికి చంద్రబాబు జైల్లో ఉండేలా ప్రణాళిక రచించారని, వీటిని ప్రజలు మాత్రమే అడ్డుకోగలరనే ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మలుపు తిరగడం ఖాయమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications