మాస్టర్ ప్లాన్-2019: ఎంపీగా 'బ్రాహ్మణి', లోకేష్ కోసం బాబు త్యాగం!, వారికి దెబ్బే!
బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ చంద్రబాబు కుటుంబానికి లాభించేదైతే.. ఏపీలో ఒకరిద్దరు ఎంపీలకు మాత్రం ఆమె ఎంట్రీ ప్రతికూలత కాక మానదు.
విజయవాడ: తరాలు మారినా పార్టీల గుత్తాధిపత్యం మాత్రం ఒకే కుటుంబం చేతిలో బంధీ అయి ఉండటం దేశ రాజకీయాల్లో ఏళ్లుగా జరుగుతున్నదే. ఇందుకోసం తొలి నుంచి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తూ.. వారసత్వ రాజకీయాలకు ఆయా పార్టీల అధినేతలు బాటలు వేస్తుంటారు. ఎటొచ్చి పార్టీ తమ చేతుల్లోంచి పట్టు జారిపోవద్దు.. పగ్గాలు మరొకరి చేతుల్లోకి వెళ్లవద్దు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ పని పూర్తి చేసేయగా.. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడిప్పుడే ఆ పనిని ముందేసుకున్నారు. ఇందులో భాగంగానే అనుకున్నట్లుగా తనయుడు లోకేష్ను ప్రత్యక్ష రాజకీయాల్లో లాంచ్ చేశారు. ఇక ఆ తర్వాతి ఎంట్రీ నారా బ్రాహ్మణిదే అన్న వాదనలు ఇప్పుడు ఊపందకున్నాయి.
కొట్టేయడానికి వీల్లేదు:
ఈ వాదనను ఏదో గాలి వార్త అని కొట్టివేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగు చంద్రబాబు, లోకేష్ చక్రం తిప్పుతారు కాబట్టి, తమ కుటుంబం నుంచే మరొకరు కేంద్రంలో చక్రం తిప్పగలిగేవారుంటే బాగుండు అన్న దిశగా చంద్రబాబు ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఇదే గనుక నిజమైతే కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఖాయమైపోతుంది.
బ్రాహ్మణి ఎంట్రీ ఎవరికి చేటు:
బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ చంద్రబాబు కుటుంబానికి లాభించేదైతే.. ఏపీలో ఒకరిద్దరు ఎంపీలకు మాత్రం ఆమె ఎంట్రీ ప్రతికూలత కాక మానదు. బ్రాహ్మణి గనుక పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న విజయవాడ లేదా గుంటూరు నుంచి బరిలో దిగే అవకాశముంది. అదే గనుక జరిగితే అక్కడి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ లలో ఎవరో ఒకరికి మూడినట్లే.
ఎంపీల్లో భయం మొదలైందా?
ఇదే విషయంపై పార్టీలోను అంతర్గత చర్చ జరుగుతుండటంతో ఈ ఇద్దరు ఎంపీల్లోను భయం మొదలైందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా లాంచ్ అయిన లోకేష్ను, వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేగా చూడాలని చంద్రబాబు కలలు కంటున్నారు. ఇందుకోసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని తనయుడికి త్యాగం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట.
'కుప్పం' త్యాగం చేస్తారట:
కుప్పంలో అయితే గెలుపు నల్లేరు మీద నడకే కాబట్టి ఇక్కడి నుంచి లోకేష్ను ఎమ్మెల్యేగా గెలిపించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో తాను కుప్పాన్ని వీడి చంద్రగిరి లేదా కష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఆయన మదిలో మెదులుతున్నట్లు సమాచారం. ఏదేమైనా 2019నాటికి తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణలు మరింత ఆసక్తిని రేకెత్తించే అవకాశం ఉంది.