'రాక్షస క్రీడ ముగిసింది.. ఇది ప్రజా విజయం...'-ఏపీలో పరీక్షల రద్దుపై రఘురామ,లోకేశ్ రియాక్షన్...
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపిన ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో దిగిరాక తప్పలేదు. దీంతో ప్రత్యర్థులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. అనవసరంగా విద్యార్థులను,వారి తల్లిదండ్రులను టెన్షన్కు గురిచేశారని... సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే తప్ప ప్రభుత్వం విద్యార్థుల కోణంలో ఆలోచించలేదని అంటున్నారు.
రఘురామ రియాక్షన్
ఏపీలో పరీక్షల రద్దుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు.'ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది. సరైన సమయంలో జోక్యం చేసుకున్నందుకు సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు.కనీసం ఇప్పటికైనా సమస్యను అర్థం చేసుకున్నందుకు ఏపీ ప్రభుత్వానికి కూడా దన్యవాదాలు.' అని తెలిపారు. అంతేకాదు,ఇది ప్రజా విజయం అని అభివర్ణించారు. అంతకుముందు,ఇదే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రఘురామ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కరోనాతో నెలకొన్న అనిశ్చితి వాతావరణం, డెల్టా వేరియెంట్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పంతాలు,పట్టింపులు వీడి విద్యార్థుల ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. పరీక్షల కారణంగా పొరపాటున జరగరాని నష్టం ఏదైనా జరిగితే అది సరిదిద్దుకోలేని తప్పు అవుతుందన్నారు.
రాక్షస క్రీడ ముగిసింది : లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరీక్షల రద్దుపై ట్విట్టర్లో స్పందించారు. 'పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులకు అభినందనలు.విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసింది.రెండు నెలల పోరాటం తరువాత జగన్ సర్కార్ దిగొచ్చి పరీక్షలు రద్దు చెయ్యడం సంతోషం.'అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకపోయి ఉంటే విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండటంతో పాటు విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు సమయం ఉండేదన్నారు.
తుగ్లక్ నిర్ణయాలతో హింసించారు : లోకేశ్
సీఎం జగన్ మానవత్వంతో ఆలోచించి ఉంటే విద్యార్థులు,తల్లిదండ్రులకు ఇంత మానసిక ఆందోళన ఉండేది కాదని... సీఎం మెంటల్ మామ అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. తుగ్లక్ నిర్ణయాలతో రెండు నెలల పాటు విద్యార్థులను హింసించారని విమర్శించారు. మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానంలో చీవాట్లు తినే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షం అడిగే న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని సీఎం జగన్ను కోరుతున్నానని తెలిపారు.
పరీక్షల రద్దుపై మంత్రి ప్రకటన
రాష్ట్రంలో పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూల్యాంకన పద్దతి,ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జుల 31 నాటికి కూడా పరీక్షలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. నిజానికి ఏపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు,చర్యలతో పరీక్షలు నిర్వహించాలనుకుందని... ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియజేశామని అన్నారు. కానీ సుప్రీం కోర్టు దానితో ఏకీభవించకపోవడంతో పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.