రివర్స్: కేబినెట్ విస్తరణ లేదు, అఖిలప్రియకు లోకేష్ అండ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. మంత్రివర్గం నుండి అఖిలప్రియను తొలగిస్తారని ప్రచారాన్ని లోకేష్ కొట్టిపారేశారు.
Recommended Video
పది రోజుల క్రితం కృష్ణా నదిలో బోటు మునిగి 22 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అధికారు అలసత్వం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకొందనే విమర్శలు వెల్లువెత్తాయి.
హైద్రాబాద్లో కూర్చొని విమర్శలా, ఏపీలో ఆధార్, ఓటరు కార్డుల్లేవ్: లోకేష్ సంచలనం
అయితే ఈ ఘటనకు సంబంధించి 8 మంది ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. అంతేకాదు ఈ ఘటనకు కారణమైన ఏడుగురిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. అయితే ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన సందర్బంగా మంత్రి అఖిలప్రియ పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారని ప్రచారం సాగింది. మంగళవారం నాడు అసెంబ్లీ లాబీల్లో ఏపీ మంత్రి లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
అఖిలప్రియపై ప్రచారం అవాస్తవం
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.మీడియాలో వార్తలు రాసి వివరణలు అడిగితే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అఖిలప్రియను కేబినెట్ నుంచి తొలగిస్తారనడంలో నిజంలేదన్నారు. అఖిలప్రియ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, బెలూన్ ఫెస్టివల్, సోషల్ మీడియా సమ్మిట్ నిర్వహించడంతో పాటు వివిధ కార్యక్రమాలతో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించారని లోకేశ్ చెప్పారు.
బోటు ప్రమాదానికి బాధ్యులను వదలం
విజయవాడలో బోటు ప్రమాదం దురదృష్టకరమని నారా లోకేష్ చెప్పారు. అయితే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకొందని మంత్రి లోకేష్ చెప్పారు. భవిష్యత్లో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకొంటున్నట్టుగా మంత్రి లోకేష్ చెప్పారు. ఈ ప్రమాదానికి బాధ్యులుగా ఉన్నవారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని లోకేష్ మరోసారి స్పష్టం చేశారు.
ఏపీలోనే ఆధార్ కార్డు, ఓటు హక్కు
ఏపీలో తమ కుటుంబానికి ఆధార్, ఓటర్ ఐడీ ఉందని లోకేష్ చెప్పారు. ఓటర్ హక్కు తనకు లేకపోతే తాను ఎమ్మెల్సీగా ఎలా ఎన్నిక అవుతానని లోకేష్ ప్రశ్నించారు. ఉండవల్లిలోనే తన కుమారుడు దేవాన్ష్ కు కూడా ఆధార్ కార్డు ఉందని చెప్పారు. అయితే తమ కుటుంబానికి ఏపీలో ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఉందా లేదా అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారని నారా లోకేష్ చెప్పారు.
కేబినెట్ విస్తరణ లేదు
మంత్రివర్గ విస్తరణ ఆలోచన లేదని నారా లోకేష్ చెప్పారు.ఈ ఏడాది ఏప్రిల్లోనే మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు. మంత్రివర్గం పునర్వవ్యవస్థీకరణ సమయంలో లోకేష్, అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే ఇటీవల చోటు చేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి కేబినెట్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని లోకేష్ కొట్టి పారేశారు.