బాబు-బాలకృష్ణ సంతోషం: కొడుకుని ఎత్తుకొని మురిసిన లోకేష్ (ఫోటో)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణలు తాతయ్యలు అయ్యారు. నారా లోకేష్ - బ్రాహ్మణిల జంటకు శనివారం.. ఉగాది పర్వదినం నాడు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు కొడుకు పుట్టాడు.
నారా లోకేష్ తన తనయుడిని చేతులతో ఎత్తుకొని మురిసిపోయాడు. శనివారం ఉదయం బ్రాహ్మణిని గచ్చిబౌలిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. సాధారణ కాన్పు అయిందని తెలుస్తోంది. చంద్రబాబు ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు రాజధాని ప్రాంతం తుళ్లూరు వెళ్లి మధ్యాహ్నం హైదరాబాదుకు వచ్చారు.
నేరుగా నోవాటెల్ హోటల్ వెళ్లి సాయంత్రం వరకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఉండగా.. చంద్రబాబుకు మనవడు పుట్టినట్లు సమాచారం వచ్చింది. సమావేశం ముగియగానే చంద్రబాబు సాయంత్రం అయిదు గంటల సమయంలో ఆసుపత్రికి వెళ్లారు.
తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే ఉన్నారు. బాలకృష్ణ, ఇతర బంధువర్గం ఆసుపత్రికి వచ్చారు. లోకేష్ ఉదయం నుండి ఆసుపత్రిలోనే ఉన్నారు. మనవడిని చూసిన అనంతరం బాలకృష్ణ, చంద్రబాబులు ఒకరికి మరొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బాలకృష్ణ మిఠాయిలు పంచారు.
కాగా, ఉగాది రోజు మనవడు జన్మించడం తమ కుటుంబానికి శుభప్రదమని, కుటుంబమంతా వేడుక జరుపుకుంటోందని చంద్రబాబు, బాలకృష్ణలు అన్నారు. ఈ శిశువు దేవుడు తమకు ఇచ్చిన గొప్ప బహుమతి అన్నారు. ఆడపిల్ల పుట్టినా, మగపిల్లాడు పుట్టినా తమకు ఒకటేనని, వ్యత్యాసం చూపమని బాలకృష్ణ అన్నారు.