ఆధారాలు చూపమంటే ముందుకు రారే: జగన్, పవన్లకు లోకేష్ చురకలు
గుంటూరు: తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ మరోసారి స్పందించారు. తనపై ఆరోపణలు చేశారు కానీ, ఆధారాలు చూపమంటే మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. ఆధారాలతో ముందుకు వస్తే తన తప్పు కూడా తెలుసుకుంటానని వ్యాఖ్యానించారు.
Recommended Video
సోమవారం గుంటూరు ఎస్ఆర్ఎం వర్శిటీలో 'ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలు- భవిష్యత్ నైపుణ్యాలు' అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో లోకేశ్ పాల్గొని ప్రసంగించారు. యువత ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
పవన్, జగన్లకు సవాల్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా లోకేష్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకేష్.. తనపై వచ్చిన ఆరోపణలపై ఆధారాలు చూపండంటూ మరోసారి సవాల్ విసిరారు.
ముందు వరుసలో ఏపీ
ఏటా డిగ్రీలు పట్టుకుని బయటకు వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల్లో 15శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. ఇంజినీరింగ్ యువత తమ నైపుణ్యాలను ఎప్పటికప్పడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఏపీ కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధిరేటుతో స్థిరమైన ప్రగతి సాధిస్తోందన్నారు. సాంకేతిక వినియోగంలో ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉందన్నారు. ఇంజినీరింగ్లోనే కాకుండా అన్ని రంగాల్లోనూ హాకథాన్ నిర్వహిస్తున్నట్లు లోకేష్ తెలిపారు.
ఆగస్టులో పెద్ద ఐటీ కంపెనీల రాక
అమరావతిలో అక్టోబర్ నాటికి 20 లక్షల స్క్వేర్ ఫీట్ల అఫీస్ స్పేస్ సిద్ధమని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరి ఐటిపార్క్కు మంచి డిమాండ్ ఉందన్నారు. ఆగస్టు నాటికి రాష్ట్రానికి పెద్ద కంపెనీలు రాబోతున్నాయని, పాలసీ ప్రకారం ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు భూములు ఇచ్చినా విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేసేవాళ్లకు ఆ సంస్థ గురించి తెలుసని లోకేష్ ప్రశ్నించారు.
జమిలికి వ్యతిరేకం
ఐటీ కంపెనీల అనుమతుల్లో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. భూముల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనలో పారదర్శకత పాటిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకమని.. ఈ విధానానికి మద్దతు ఇవ్వబోమని లోకేశ్ స్పష్టం చేశారు. అవిశ్వాసంపై టీడీపీ ఏం చేస్తుందో త్వరలోనే చూస్తారని వ్యాఖ్యానించారు.