ఏం జరిగినా నేనేనా, జగన్కు ఇరిటేషన్.. దమ్ముంటే రా: లోకేష్ సవాల్
విజయవాడ: వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు చెందిన సాక్షి మీడియాలో వచ్చిన కథనంపై టిడిపి యువనేత నారా లోకేష్ బుధవారం నాడు తీవ్రంగా స్పందించారు. జగన్, వైసిపి నేతలు తమ ఆస్తులు ప్రకటించి బహిరంగ చర్చకు రావాలని, అలా వచ్చే దమ్ముందా అని లోకేష్ ప్రతి సవాల్ చేశారు.
తాము ఏడుసార్లు తమ ఆస్తులను ప్రకటించామని చెప్పారు. ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువగా ఉంటే రాసిస్తామని కూడా చెప్పామన్నారు. తమలాగే జగన్, వైసిపి నేతలు తమ ఆస్తులను ప్రకటించి.. అందరి ఆస్తుల పైన బహిరంగ చర్చకు వస్తే తాము చర్చకు సిద్ధమని చెప్పారు.
ప్రభుత్వం పైన జగన్ అవిశ్వాసం పెట్టాలనుకోవడం విడ్డూరమన్నారు. వైసిపిలోనే మెజార్టీ ఎమ్మెల్యేలకు అవిశ్వాసం పెట్టడం ఇష్టం లేదని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష భేటీలో ఎమ్మెల్యేలు రెండు ప్రశ్నలు అడగ్గానే జగన్ కోపానికి, ఇరిటేషన్కు గురయ్యాడన్నారు.
జగన్ చేస్తున్న ప్రచారం, రాయిస్తున్న వార్తల పైన తాము పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. టాటా, బిర్లాలు రాష్ట్రంలో ఆస్తులు కొన్నా కూడా తనకు లంకె పెడితే ఎలాగని ప్రశ్నించారు. ఏపీలో ఏం జరిగినా నాకు సంబంధం ఉందని చెప్పడం సరికాదన్నారు.
'భూదందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి'
ఏపీలోని అమరావతిలోని భూఆక్రమణ కథనాల పైన మాజీ ఐఏఎస్ శర్మ తీవ్రంగా స్పందించారు. రాజధాని భూముల ఆక్రమణ వ్యవహరంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ కలామ్కు తాను రాసిన లేఖ వివరాలను వెల్లడించారు.
గత నెల 22వ తేదీన తాను ప్రభుత్వానికి రాసిన లేఖ, నేటి సాక్షి పద్రికలో వచ్చిన కథనాల్లోని అంశాలు ఒకేలా ఉన్నాయన్నారు. సిఆర్డీఏకు సంబంధించి ప్రతి జవో బడాబాబులకు లాభం చేకూర్చేలా ఉందని విమర్శించారు. రాజదాని భూదందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.