పవన్ 'వీడియో'కు లోకేష్ కౌంటర్: 'జనసేనానిపై పరువునష్టం దావా, ఆయన తిక్కకున్న లెక్క చెప్తా'
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. శనివారం మంత్రి నారా లోకేష్, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తదితలు జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్.. పవన్ విమర్శల వీడియోను పోస్టు చేసి కౌంటర్ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం స్థానికులకు భూములివ్వకుండా ఫ్రాంక్లిన్ సంస్థకు ఇచ్చిందని పవన్ శుక్రవారం చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోను అతను తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ఆయనకు వివరణ ఇచ్చారు. ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు సృష్టించాలనుకుంటే వారికి ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలుకుతామన్నారు.
లోకేష్ కౌంటర్
అలాంటి వారిని తాను స్వయంగా ఆహ్వానించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నానని లోకేష్ చెప్పారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వలేదని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటని లోకేష్ చెప్పారు. రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టి 2400 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోందని, స్థానిక పారిశ్రామికవేత్తలకు అన్యాయం జరుగుతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విశాఖలో పల్సస్ టెక్ సంస్థకు భూమి కేటాయించామని, ఆ కంపెనీ సీఈవో శ్రీనిబాబుది శ్రీకాకుళమేనని చెప్పారు.
స్థానిక పారిశ్రామికవేత్తలకు అన్యాయం జరుగుతోందని పవన్ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. శ్రీకాకుళంలో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేందుకు బీపీవో కంపెనీ ఏర్పాటు కాబోతోందన్నారు. ఏపీ ఊరికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ కాలేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన వారికి ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. తాను స్వయంగా వెళ్లి వాళ్లను ఆహ్వానించి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.
చిరంజీవికే సాధ్యం కాలేదు ఇక పవన్ ఎంత?
ముఖ్యమంత్రి కావడం చిరంజీవికే సాధ్యం కాలేదని, ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ వల్ల ఎలా అవుతుందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి పవన్కు అవగాహన లేదన్నారు. వవన్ అవగాహనారాహిత్య యువకుడు అన్నారు. జగన్ అర్థంలేని వ్యక్తి అన్నారు.
పవన్ నాకు క్షమాపణలు చెప్పాలి
పవన్ అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలకు ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. పదిహేను రోజుల్లో రుజువు చేయాలని, లేనిపక్షంలో పవన్ పైన పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పవన్ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని, అయినప్పటికీ, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పవన్ లాగే తనకు కూడా కొంచెం తిక్కుందని, దానికో లెక్కుందంటూ వ్యాఖ్యానించారు. పవన్ తనకు క్షమాపణ చెప్పకపోతే ఆ లెక్కేంటో చెబుతానన్నారు.
పవన్కు అవగాహన లేదు
పవన్ పైన ఏపీ టీడీపీ అధ్యక్షులు, మంత్రి కళా వెంకట్రావు కూడా మండిపడ్డారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్పై పవన్కు అవగాహన లేదన్నారు. అందుకే అలా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ రాజకీయ డ్రామాలు ఆడుతోందన్నారు. ప్రతివారం కోర్టుకు హాజరయ్యే జగన్ తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీతో కుమ్మకై జగన్ కేసుల మాఫీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.