రెడ్బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, చేస్తే - జగన్ కు లోకేష్ కౌంటర్..!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రెడ్ బుక్ పైన చర్చ జరుగుతోంది. ఏపీలో దాడుల పైన మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేసారు. ఆ సమయంలోనూ తరువాత లోకేష్ రెడ్బుక్ గురించి విమర్శలు చేసారు రెడ్బుక్ పేరుతో అధికారులను..పార్టీ నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. రెడ్బుక్ పేరుతో హోర్డింగ్స్ ఏర్పాటు చేసారని చెప్పుకొచ్చారు. దీని పైన మంత్రి లోకేష్ స్పందించారు. జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
రెడ్బుక్ వివాదం
మాజీ సీఎం జగన్ కొద్ది రోజులుగా రెడ్బుక్ గురించి ప్రస్తావిస్తున్నారు. రెడ్బుక్ పేరుతో బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీని పైన స్పందించిన లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఇంకా రెడ్బుక్ తెరవక ముందే జగన్ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్రెడ్డిని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డారు.

జగన్ కు కౌంటర్
రెడ్బుక్కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించారని అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ 2 ప్రెస్మీట్లు పెడితే 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్మీట్లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలను తాము వివరిస్తాం కదా అని నిలదీశారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరు, జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరని తెలిపారు.
జగన్ లెక్కలతో
పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. అటు జగన్ బెంగళూరు వెళ్లారు. వచ్చే వారం తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు అసత్య పత్రాలుగా జగన్ ఆరోపించారు. సుదీర్ఘ మీడియా సమావేశంలో తమ పాలనలో చేసిన అప్పుల గురించి వివరించారు. జగన్ చెప్పిన అంశాలను టీడీపీ మంత్రులు కౌంటర్ చేసారు. దీంతో, అసలు అటు జగన్ చెబుతున్న లెక్కలు..ఇటు ప్రభుత్వం వెల్లడిస్తున్న శ్వేతపత్రాల్లో ఏది నిజమనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications