శ్రీవారిని దర్శించుకున్న లోకేష్ - గంటసేపు ఆపడంపై బీటెక్ రవి ఫైర్- చీప్ ట్రిక్స్ అంటూ..
టీడీపీ యువనేత నారా లోకేష్ ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పాదయాత్ర నేపథ్యంలో దర్శనానికి వచ్చిన ఆయన పలువురు నేతలతో కలిసి దర్శనం చేసుకున్నారు.
తిరుమల : ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాదయాత్రకు రంగం సిద్దమవుతోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి పాదయాత్ర కోసం ఏపీకి వచ్చిన లోకేష్.. ఇప్పటికే కడప పెద్ద దర్గాతో పాటు చర్చిలోనూ ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చిన ఆయన.. ఇవాళ దర్శనం చేసుకున్నారు. అయితే లోకేష్ దర్శనం ఆలస్యం అయింది. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేష్ దర్శనం కోసం ఉదయాన్నే చేరుకున్నప్పటికీ టీటీడీ అధికారులు ఆలస్యం చేశారు. దీంతో టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, టీటీడీ అధికారులపై ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వస్తే గంటకుపైగా క్యూకాంప్లెక్స్లోనే ఉంచారని బీటెక్ రవి మండిపడ్డారు.

తిరుమల ఆలయంలోనూ వైసీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందంటూ బీటెక్ రవి ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనమని, ఓటమి భయంతోనే నారా లోకేష్ పాదయాత్రపై వైసీపీ విమర్శలు చేస్తోందని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. మరోవైపు ఇవాళ తిరుమల దర్శనం పూర్తి చేసుకున్న లోకేష్.. రేపు కుప్పం నుంచి తన యువగళం పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.













Click it and Unblock the Notifications