సాయిరెడ్డి రాజీనామా అందుకే-లోకేష్ ఫస్ట్ రియాక్షన్..!
సాక్షి పత్రికలో తనపై వచ్చిన కథనంపై పరువునష్టం దావా వేసి పోరాడుతున్న ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ మరోసారి విశాఖ కోర్టుకు హాజరయ్యారు. గతంలో సాక్షి రాసిన కథనంపై తాను తుది వరకూ పోరాడతానని, ఎన్నిసార్లు అయినా కోర్టుకు హాజరవుతానని, మంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి వ్యక్తిగత డబ్బులు వెచ్చించి మరీ, పార్టీ ఆఫీసులో పడుకుని కోర్టుకు హాజరైనట్లు లోకేష్ వెల్లడించారు. ఇది తన తల్లి భువనేశ్వరి నేర్పించిన విలువలు అన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై నారా లోకేష్ స్పందించారు.తల్లీ, చెల్లికే జగన్ పై నమ్మకం లేదని, ఇంకా పార్టీ నేతలకు ఏం నమ్మకం ఉంటుందని విజయసాయిరెడ్డి రాజీనామాపై నారా లోకేష్ ప్రశ్నించారు. పార్టీలో నేతలెవరికీ జగన్ పై నమ్మకం లేదని లోకేష్ తేల్చిచెప్పేశారు. కాకినాడ పోర్టు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. సాయిరెడ్డిని టీడీపీలో చేర్చుకుంటారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ ఆయన ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నారన్నారు.

మరోవైపు దావోస్ టూర్ లో పెట్టుబడుల్ని ఆకర్షించడంలో విఫలమయ్యారన్న ప్రశ్నపైనా లోకేష్ స్పందించారు. దావోస్ లో ఎప్పుడూ ఒప్పందాలు కుదరవని, ఇందులో చర్చలు మాత్రమే జరుగుతాయని, ఆ తర్వాత ఒప్పందాలు చేసుకుంటామన్నారు. వైసీపీ నేత రోజా విమర్శలపై స్పందిస్తూ ఆమెకు దావోస్ కూ, జ్యురిచ్ కూ తేడా తెలియదన్నారు. వైజాగ్ లో 90 రోజుల్లో టీసీఎస్ వస్తుందని లోకేష్ వెల్లడించారు. రెడ్ బుక్ అమలు వల్లే పెట్టుబడులు రావడం లేదన్న విమర్శలపై స్పందిస్తూ.. వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు.
అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వకుండా సాయం చేయడం వల్ల ప్రయోజనం లేదంటూ వస్తున్న విమర్శల్ని లోకేష్ తోసిపుచ్చారు. ఆర్సెలర్ మిత్తల్ కూడా అనకాపల్లిలో క్యాప్టివ్ మైన్స్ లేకుండానే ప్లాంట్ పెట్టేందుకు వస్తుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ జరగదని ఇప్పటికే చంద్రబాబు, కుమారస్వామి చెప్పారని, ఇంకా ఎన్నిసార్లు, ఎంతమంది చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ప్రైవేటీకరణ జరగదని బాండ్ పేపర్ మీద రాసివ్వాలా అని అడిగారు.












Click it and Unblock the Notifications