నీవు చేతుల కట్టుకోవడమే! ఇక హోదాపై పోరాటం ఎప్పుడు?: జగన్పై లోకేష్ సెటైర్లు
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదిక తీవ్రంగా స్పందించారు.
హోదా కోసం తమ పార్టీ ఎంపీలు చెప్పినట్లుగానే రాజీనామాలు చేశారని.. ఏపీ ప్రజలతో కలిసి నడవాలనుకుంటే చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయాలని జగన్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
ఢిల్లీ నుంచి గల్లీ దాకా మా పోరాటం
ఈ నేపథ్యంలో జగన్ ట్వీట్కు మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు. ‘ఏపీకి న్యాయం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేం పోరాడుతున్నాం. జగన్ మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు' అని లోకేష్ ఎద్దేవా చేశారు.
చేతులు కట్టుకోవడమే..
అంతేగాక, ఏపీ కోసం జగన్ ఎక్కడా గొంతు ఎత్తలేదని.. ఆయన కోర్టుల్లో చేతులు కట్టుకోవడంలో, శుక్రవారం ప్రార్థనల్లో బిజీగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి లోకేష్.
ఇలాంటి బాబుపై విమర్శలా?
ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని లోకేష్ చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రిపై కొందరు విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.
హోదా కోసం జగన్
ఏపీ ప్రజల హక్కు ప్రత్యేక హోదా అని, హోదా సాధన కోసం ఐకమత్యంగా పోరాటం చేద్దామని జగన్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో తమ పార్టీ ఎంపీల రాజీనామాలు చేయడంతోపాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని చెప్పారు. అంతేగాక, ఏపీ ప్రజలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో హోదా నిరసనలు చేపడతామని ట్విట్టర్ వేదికగా స్పందించారు.