పిల్లులే.. పులులనుకుంటున్నాయ్.. రెండు చెంపలు వాయిస్తాం: నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకపోయినా.. రాష్ట్రంలో గంజాయి పరిశ్రమ మాత్రం బాగా నడుస్తోందని ఆరోపించారు. గంజాయి కేంద్రంగా ఏపీ మారిందని ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
పోలీసులే దాడులు చేయిస్తున్నారంటూ లోకేష్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్ష రెండో రోజు కొనసాగింది. ఎన్టీఆర్ భవన్కు మంగళగిరి నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలోని కీలక నేతలు, కార్యకర్తలు కూడా వచ్చారు. ఈ సందర్బంగా నారా లోకేష్ ప్రసంగించారు. గంజాయితో యువత భవిష్యుత్తును ప్రశ్నార్థంక చేస్తున్నారని నిలదీస్తే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని విమర్శించారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమన్నారు.
దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ లోకేష్ సవాల్.. హెచ్చరిక
ఎవరూ లేని సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూకలు దాడి చేశారని.. దమ్ముంటే ఇప్పుడు రావాలని లోకేష్ సవాల్ విసిరారు. పోలీసుల అండ లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు రావాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. వారు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేష్ హెచ్చరించారు.
రెండు చెంపలు వాయిస్తాం.. కేసులు పెడితే లోకేష్ బండి ఆగదు
తమ పార్టీ ఆఫీసు అద్దాలు మాత్రమే పలిగిలాయి.. తమ కార్యకర్తల గుండెలు వైసీపీ గాయపర్చలేరని అన్నారు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడక్కర్లేదని అన్నారు. ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయగొడతామని లోకేష్ హెచ్చరించారు. జగన్ రెడ్డిలా తాను చిన్నాన్న జోలికి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. జగన్ మగాడైతే చిన్నాన్న హత్య కేసును తేల్చాలన్నారు. 2019 ముందు తనపై ఏ కేసూ లేదని. ఏ పోలీస్ స్టేషన్కు వెళ్లలేదన్నారు. జగన్ సీఎం అయ్యాక తనపై హత్యాయత్నం సహా 11 కేసులు పెట్టారని లోకేష్ మండిపడ్డారు. తనపై కేసులు పెడితే తన బండి ఆగదని.. మరింత స్పీడుగా వెళ్తుందని స్పష్టం చేశారు.
Recommended Video
పిలులు.. పులులనుకుంటున్నాయ్..: లోకేష్, మంగళగిరి గిఫ్ట్
పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంత భయమని అన్నారు లోకేష్. కొన్ని పిల్లులు.. పులుమని భావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లు ఆగండి.. చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 2024లో మంగళిగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తానని ప్రకటించారు. వైసీపీకి ట్రైలర్ మాత్రమే చూపాం.. సినిమా ముందుంది అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తమది పేటీఎం బ్యాచ్ కాదని.. పసుపు సైన్యమని లోకేష్ తెలిపారు. కాగా, వైసీసీ దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దీక్ష వేదికగా టీడీపీ నేతలు వైసీపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.