మంచి కాదు రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి: జగన్పై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జగన్ అండ్ కో ఇసుక నుంచి కూడా తైలం తీయగలరని నిరూపించుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ రాలిపోయిన రత్నమేగా!: రివర్స్ టెండరేశారంటూ జగన్పై లోకేష్ ఫైర్, వీడియో ట్వీట్
ముంచే ముఖ్యమంత్రి..
‘‘మంచి'ముఖ్యమంత్రి అనిపించుకుంటా..అని వైఎస్ జగన్గారు అన్నట్టు నేను తప్పుగా విన్నా. ఆయన నిజమే చెప్పారు. జగన్ గారు అన్నది రాష్ట్రాన్ని'ముంచే' ముఖ్యమంత్రి అవుతా అని. అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేసారు.భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చూస్తుంటే ఆందోళనగా ఉంది' అంటూ లోకేష్ ఘాటుగా స్పందించారు.
జే టాక్సుతో బెంబేలెత్తిపోతున్నారు..
‘ఐదు నెలల పాలనలోనే రాష్ట్రాన్ని ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లిన అసమర్థ సీఎం వైఎస్ జగన్గారి జె-ట్యాక్స్ తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెదేపా హయాంలో రూ.10 వేలు ఉన్న లారీ ఇసుకను ఇప్పుడు వైకాపా ఇసుకాసురులు 40 వేల నుండి లక్ష రూపాయిలకు అమ్ముకుంటూ ప్రజలను లూటీ చేస్తున్నారు' అని మాజీ మంత్రి లోకేష్ మండిపడ్డారు.
కార్మికుల పొట్టకట్టి..
‘నిర్మాణరంగం పడకేసి, కార్మికులు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5 నెలల నుండి పని లేకుండా చేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిన వైకాపా ప్రభుత్వం, ఒక్కో కార్మికుడికి నెలకి రూ.10 వేలు చొప్పున 50 వేల భృతి వెంటనే చెల్లించాలి' అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
జగన్ అండ్ కో.. ఇసుక నుంచి కూడా తైలం తీయగలరు..
‘వైఎస్ జగన్ అండ్ కో ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు అని మరోసారి నిరూపించుకున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇసుక ధరని రెండింతలు పెంచి ప్రజల నెత్తి పై గుదిబండ వేసారు. ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజలకు దొరకని ఇసుక అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలి పోతుంది. ఇసుక కొనడానికి ప్రజల ఇల్లు గుల్ల అవుతుంటే, ఇసుక దోపిడీ ద్వారా వచ్చిన డబ్బు దాచుకోవడానికి ఇల్లు సరిపోక వైకాపా నాయకులు విదేశాలు వెళ్లి వస్తున్నారు' అంటూ లోకేష్ తీవ్రంగా విమర్శించారు.