టీడీపీ ఆశాకిరణం లోకేష్, తెలంగాణపై శిద్ధా ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఆశాకిరణమని ఆ పార్టీ నేత కిమిటి కళా వెంకట్రావు అన్నారు. ఈ నెల 12వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ పర్యటించనున్నారు. ఆయన పర్యటన పార్టీలో కొత్త ఉత్సాహం నింపుతుందన్నారు. కాగా, లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి.. మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు.
జగన్కు అవగాహన లేదు: వసంత
రాయలసీమ ప్రాంతానికి నీరందించేందుకు ఉద్ధేశించిన పట్టిసీమ ప్రాజెక్టుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చేయనున్న పట్టణాల్లో నందిగామ ఉండటం హర్ణణీయమన్నారు.
నిధులు సాధించాలి: ఆనం
అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి కట్టుగా పోరాడి పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించాలని ఆనం వివేకానంద రెడ్డి తిరుమలలో అన్నారు. గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నష్టపోవటమే గాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు వస్తాయన్నారు. నాయకులు సంఘటితంగా కృషి చేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్నారు.
గవర్నర్ నరసింహన్తో మంత్రి శిద్ధా భేటీ
గవర్నర్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్ మంత్రి శిద్ధారాఘవ రావు గురువారం ఉదయం సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ టాక్స్ వసూలును గవర్నర్ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ప్రజల అవసరాల రీత్యా రాజధానికి రాకపోకలుంటాయన్నారు. పదేళ్లపాటు యథావిధిగా పన్నుల విధానం ఉండాలని తెలిపారు.