గ్రేటర్ ఎన్నికల షాక్: ఎపి రాజకీయాల వైపే నారా లోకేష్?
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు పెద్ద షాక్నే ఇచ్చాయి.
ఫలితాల వెల్లడి తర్వాత ఆయన పార్టీ నాయకులకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు వేరు, వచ్చే 2019 ఎన్నికల స్థితిగతులు వేరుగా ఉంటాయని ఆయన చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని సీమాంధ్ర ఓటర్లంతా ఆ ఎన్నికల సమయంలో తమవైపే ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, తెలంగాణలో పార్టీని తిరిగి పట్టాలపైకి ఎక్కించడం అంత సులభం కాదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు సహా ముగ్గురు శాసనసభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రమ కలిగించే విధంగా పార్టీ మారడం టిడిపిని పెద్దగానే దెబ్బ తీసింది.
ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నిలబెట్టే ప్రయత్నాలను మానుకుని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్లిపోవడం మంచిదనే ఆలోచనలో ఆయన పడినట్లు చెబుతున్నారు. నిజానికి, తెలంగాణలో పార్టీ విషయంలోనే కేంద్ర మంత్రి సుజనా చౌదరికి, నారా లోకేష్కు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని అంటున్నారు. తెలంగాణలో పార్టీని తిరిగి అధికారం చేపట్టే స్థాయికి తేవడం చాలా కష్టమని, అక్కడ పార్టీని వదిలేసుకోవడమే మంచిదని సుజనా చౌదరి సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.
అయితే, నారా లోకేష్ గానీ రేవంత్ రెడ్డి గానీ అందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ను తాము ఎదుర్కుంటామని వారు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా సుజనా చౌదరి మాటకే విలువ ఇచ్చినట్లు సమాచారం. అందుకే సుజనా చౌదరికి, నారా లోకేష్కు మధ్య విభేదాలు పొడసూపినట్లు కూడా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఎపి రాజకీయాలపై దృష్టి పెట్టాలని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.