ఇలా ముందుకెళ్దాం: చేరికలపై చంద్రబాబుతో లోకేష్ మంతనాలు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంగళవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో... పార్టీలోకి వెల్లువెత్తుతున్న చేరికలపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. తాజాగా నేడు బొబ్బిలి రాజవంశానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబినాయన టీడీపీలో చేరుతున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు, లోకేశ్ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అప్పటికే ఉన్న టీడీపీ నేతలు, కొత్తగా చేరుతున్న వైయస్సార్ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయంపై ఈ సందర్భంగా తండ్రీకొడుకులిద్దరూ చర్చించినట్లు తెలిసింది.
జగన్ నాయకత్వ లోపమే: కళా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపంతోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును చూసి టీడీపీలో చేరుతున్నారని పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు అన్నారు. విశాఖపట్నంలోని డాబాగార్డెన్స్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరుతారని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీలో నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో తాగునీటి కొరత నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాష్ట్రంలోని ఎనిమిది వేల స్వచ్ఛంద సంస్థల ద్వారా చలివేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రకటించిన ర్యాంకులు పార్టీ అంతర్గత వ్యవహారమని, పనితీరు మెరుగుపరచుకోడానికే తప్ప దానిపై చర్చించడం అనవసరమని పేర్కొన్నారు.