నవంబరు నుంచి నారా లోకేష్ పాదయాత్ర??
పాదయాత్ర అంటే మనకు గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజకీయాల్లో పాదయాత్రపై ఆయన అంతటి గాఢమైన ముద్రను వేశారు. పాదయాత్ర కూడా తనను నమ్ముకున్నవారిని ఎప్పుడూ మోసం చేయలేదు. వైఎస్ తర్వాత మీ కోసం పేరుతో చంద్రబాబునాయుడు చేసిన పాదయాత్ర, ఓదార్పు పేరుతో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర వారికి అధికారాన్ని కట్టబెట్టింది. తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు, మరోసారి అధికారాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

టీడీపీలో ఉత్సాహాన్ని నింపిన మహానాడు
2019 ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్న టీడీపీకి చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు, మహానాడు, మినీ మహానాడులు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. నూతన ఉత్తేజంతో ఉన్న ఆ పార్టీ ఏ క్షణమైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా శ్రేణులను సిద్ధం చేస్తోంది. అధినేత చంద్రబాబు అందుకు తగ్గట్లుగా నాయకులను, కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న స్పందనను ప్రజల్లో ఇలాగే కొనసాగించేలా చేయాలంటే పాదయాత్ర లాంటి కార్యక్రమం అవసరమని పార్టీ అధిష్టానం భావించడంతో పాదయాత్ర ఆలోచన అంకురించింది.

ఇతర పార్టీలకు ధీటుగా..
చంద్రబాబు తర్వాత పార్టీలో అంతా తానే అయిన ఆయన తనయుడు నారా లోకేష్ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు నుంచే ప్రారంభించాలనుకున్నప్పటికీ నవంబరు నుంచి జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం చేపట్టి పార్టీ శ్రేణులచేత ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించి చెప్పిస్తోంది. మరోవైపు జనసేనాని విజయదశమికి బస్సు యాత్ర ప్రారంభించేందుకు అన్నిరకాలుగా సన్నద్ధమవుతున్నారు.

3ఎన్నికలు జరిగేంతవరకు కొనసాగనున్న యాత్ర
ప్రత్యేకంగా ఇంతకాలం నిర్ధిష్టంగా ఉండాలనే నియమం ఏమీ పెట్టుకోకుండా ఎన్నికలు జరిగేంతవరకు పాదయాత్రను కొనసాగించాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. ఏడాది ముందుకానీ, ఆరు నెలల ముందుకానీ ముందస్తు రావచ్చనే అంచనాతో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఉన్నాయి. నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు లోకేష్ పాదయాత్ర ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి? రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలి? లాంటి ప్రతిపాదనలన్నీఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను చుట్టివచ్చేలా ఈ యాత్ర ఉండబోతోందని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications