చంద్రబాబు అరెస్టుకు భయపడం-కేంద్రం పాత్ర తెలీదు- లోకేష్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు పంపడంపై ఇవాళ ఆయన తనయడు లోకేష్ రాజమండ్రిలో స్పందించారు. చాలా సంక్షోభాలు చూశానని, ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందో లేదో తెలియదన్నారు. తనకు చాలా మంది అండగా ఉన్నారని,తాను ఒంటరిని కాదన్నారు. యువగళం తాత్కాలికంగా ఆపానని, మా నాయకుడిపై దాడి జరుగుతోందని ఆపామని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్రం, దేశం గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబని, నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని లోకేష్ తెలిపారు. బిల్ గేట్స్ ను అడిగినా, బిల్ క్లింటన్ ను అడిగినా చంద్రబాబు ఓ బ్రాండ్ అని చెబుతారన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణ చేసి జైలుకు పంపిన వ్యక్తి సైకో జగన్ అన్నారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో స్పందన వచ్చిందన్నారు. టీడీపీ బంద్ కు ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి సహకరించారన్నారు. బంద్ ను జయప్రదం చేసిన టీడీపీ,జనసేన, అన్న పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు.

సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు జోలికి రావడం అని లోకేష్ అన్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడన్నారు. జగన్ కు అధికారం అంటే తెలియదని, అధికారం అంటే సంక్షేమం, ఉద్యోగాల కల్పన, కానీ జగన్ అధికారం అంటే కక్షసాధింపు, దొంగ కేసులు అన్నారు. పాముకు తలలోనే విషం, జగన్ కు ఒళ్లంతా విషమన్నారు. మమతా బెనర్జీ వంటి వారు ఈ అరెస్టును ఖండించారన్నారు. పింక్ డైమండ్, బాబాయ్ హత్య కేసు, కోడి కత్తి కేసులో ఎంత అబద్ధముందో ఈ కేసులోనూ అంతే అబద్ధముందన్నారు.
స్కిల్ కేసులో డబ్బులు చంద్రబాబు అకౌంట్ కి కానీ, ఆయన బంధువుల అకౌంట్లలో కానీ షెల్ కంపెనీల్లో కానీ డబ్బులు వెళ్లాయా అని లోకేష్ స్పందించారు. జగన్ పైన 38 కేసులున్నాయి. అందులో సీబీఐ, ఈడీ కేసులున్నాయన్నారు. బాబాయ్ కేసులో దోషుల్ని జగన్ కాపాడుతున్నారన్నారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికొస్తే శాంతిభద్రతల సమస్య చూపించి కాపాడారన్నారు. నేరస్తుల్ని టీటీడీ మెంబర్లను చేశాడన్నారు. జగన్ అవినీతి బురదను ఏపీలో నాయకులందరిపైనా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ విమర్శించారు.
చంద్రబాబుపై అవినీతి ముద్ర పడలేదని, జగన్ సైకో తత్వం బయటపడిందని లోకేష్ విమర్శించారు. స్కిల్ కేసు ఓ ఫేక్ కేసు. ఈ కేసులో చంద్రబాబుకు డబ్బులొచ్చినట్లు ఎక్కడా ప్రభుత్వం చూపలేకపోయిందన్నారు. 2013లో అప్పటి గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్ లోనూ అమలు చేశారన్నారు. ఇదే కంపెనీ సీఈవోలు అప్పుడు గుజరాత్ లోనూ సంతకాలు చేశారు. గుజరాత్ సహా 7 రాష్ట్రాల్లో ఇదే ప్రాజెక్ట్ అమలవుతోందన్నారు. నిరుద్యోగులకు నైపుణ్యాల అభివృద్ధితో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టుఅమలుచేశామన్నారు. దీంతో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
ఈ ప్రాజెక్టు అమలు చేసింది ప్రేమ్ చంద్రారెడ్డి, అమలు చేసింది అజయ్ కల్లం రెడ్డి, ఈ ప్రభుత్వం లో సలహాదారులుగా ఉన్న వీరిద్దరిపై ప్రభుత్వం ఏ కేసూ పెట్టలేదని లోకేష్ విమర్శించారు. 2021లోనే కేసు పెట్టినా రెండేళ్లలో ఛార్జిషీట్ వేయలేకపోయారు. దీనర్ధం తప్పు జరగలేదన్నారు. ఈడీ కేసులోనూ మనీలాండరింగ్ జరగలేదని తేల్చేశారన్నారు. చంద్రబాబుకు డబ్బులు ఎక్కడ వచ్చాయో ఇప్పుడైనా నిరూపించాలని ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేశారు. ఆధారాలతో పలానా ఖాతాకు, పలానా షెల్ కంపెనీకి డబ్బులొచ్చాయని నిరూపిస్తారా అని అడిగారు.
ప్రజల తరఫున పోరాడుతున్నాం, ఏ తప్పూ చేయలేదన్నారు. ఎన్నిసార్లు జైలుకు పంపుతారో పంపుకోండన్నారు. మా పోరాటం మాత్రం ఆగదన్నారు. 43 వేల కోట్లు దొబ్బి బయట తిరుగుతున్నారు, సొంత బాబాయ్ ను చంపిన అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నాడన్నారు. దొంగ కేసులు పెడితే నోర్మూసుకుంటాం అనుకుంటున్నాడన్నారు. నేను వదలిపెట్టను, ప్రజల్లోకి వెళ్తాను, ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతాను, అప్పటివరకూ పోరాటం ఆపనన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తారని మంత్రులు ముందే చెప్పారన్నారు. మీ లోకేష్ ను కూడా అరెస్టు చేస్తామని మంత్రులు ఇప్పుడు చెప్తున్నారని, రాజమండ్రిలోనే ఉన్నా, ఎక్కడా పారిపోలేదన్నారు.












Click it and Unblock the Notifications