అవగాహన ఉందా? హోదాకు యూసీకి సంబంధమేంటి?: అమిత్ షాకు లోకేష్ కౌంటర్
అమరావతి: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖపై రాష్ట్రమంత్రి నారా లోకేష్ స్పందించారు. అమిత్ షాకు రాష్ట్ర సమస్యలపై అవగాహన లేదని అన్నారు. ఆయన లేఖతోనే అది స్పష్టమైందని అన్నారు.
ఏపీలో జరిగిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికేట్లు కేంద్రానికి పంపుతూనే ఉన్నామని చెప్పారు. అయినా, యూసీకి ప్రత్యేక హోదాకు సంబంధం లేదని అన్నారు.

హోదాతో సహా 18 హామీల అమలుకు యూసీ అవసరమా? అని నారా లోకేష్ స్పందించారు. ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఆవేపూరిత నిర్ణయమని అమిత్ షా అంటున్నారని.. కానీ, మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత కూడా తమ ఎంపీలు ఎన్డీఏలోనే ఉన్నారని గుర్తు చేశారు. ప్రజల అసంతృప్తిని అనేకసార్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
అమిత్ షా లేఖపై త్వరలోనే పూర్తి స్థాయిలో నివేదిక పంపిస్తామని లోకేష్ అన్నారు. షా లేఖపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తారని ఆయన తెలిపారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చిన నాటి నుంచి బీజేపీ, టీడీపీ నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం తీవ్రస్థాయికి పెరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications