నేను జగన్లా చేయను, జైలుకెళ్తా: సవాల్ విసిరిన లోకేష్, తెరాసపై..
తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి కళంకం తెచ్చినట్లు తాను తన తండ్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చెడ్డపేరు తీసుకు రానని టిడిపి యువనేత నారా లోకేష్ అన్నారు.
తిరుపతిలో మూడో రోజు జరుగుతున్న మహానాడులో లోకేష్ మాట్లాడారు. అంతకుముందు ఆయన ప్రతిపక్ష పార్టీ అభివృద్ధి నిరోధక చర్యలు, కుట్ర రాజకీయాల పైన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ పైన దుమ్మెత్తి పోశారు.
తన పైన వైసిపి నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, వారు వాటిని నిరూపించగలరా అని సవాల్ చేశారు. దమ్ముంటే తన పైన చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. ఆరోపణలు నిరూపిస్తే తాను జైలుకు అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు.
కాపు ఉద్యమం సందర్భంగా జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూశారని ఆరోపించారు. తన పైన వచ్చిన ఒక్క ఆరోపణనైనా వారు నిరూపించగలరా అన్నారు. తన వల్ల తన తండ్రికి చెడ్డపేరు తీసుకు రానన్నారు. తాను జగన్లా కాదని అభిప్రాయపడ్డారు. దొంగబ్బాయి తన దొంగ పేపర్లో ఇష్టారీతిన వార్తలు రాస్తాడన్నారు. జగన్ సీమలో ఓ మాట, గోదావరి జిల్లాల్లో మరో మాట మాట్లాడుతారన్నారు.
తెరాసపై..
తెలుగుదేశం పార్టీ ఆంధ్రా పార్టీ అని తెలంగాణలో తెరాస దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టిడిపి ఆవిర్భావమే తెలంగాణలో జరిగిందన్న విషయం గుర్తించాలన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు వేయించామన్నారు. 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఆర్నెళ్లు బస్సులోనే ఉంటూ పని చేశారని చెప్పారు. ఆరు నెలల్లోనే నదులను అనుసంధానం చేశారన్నారు. విభజన జరిగాక ఏపీకి ఎన్నో కష్టాలు అన్నారు. రాజధాని ఎక్కడుందో తెలియదన్నారు. 2019లోను టిడిపిదే అధికారం అన్నారు.