జగన్లా బలి చేయను, సర్పంచ్గా రెడీ, మంచిపేరు వస్తుందో లేదో: లోకేష్
తాను ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలా ఒకరిని బలి చేసి రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సోమవారం అన్నారు.
అమరావతి: తాను ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలా ఒకరిని బలి చేసి రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సోమవారం అన్నారు. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మాట్లాడారు.
తక్కువ సమయంలో ఎమ్మెల్సీగా.. కారణం ఇదే
అతి తక్కువ సమయంలో తనకు అద్భుత అవకాశం దక్కిందని చెప్పారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం రావడానికి కార్యకర్తలే కారణమని చెప్పారు. అయిదేళ్లుగా పార్టీ కోసం పని చేశానని, కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశానని చెప్పారు. పార్టీ కోసం గత ఎన్నికల్లో పని చేశానని చెప్పారు.
మంచి పేరు వస్తుందో లేదు.. చెడ్డపేరు మాత్రం తీసుకురాను
ఎమ్మెల్సీ అయ్యేందుకు తనకు సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని నారా లోకేష్ చెప్పారు. తనకు సహకరించిన వారికి పాదాభివందనాలు అన్నారు. నేను నా తాత (ఎన్టీఆర్), తండ్రి (చంద్రబాబు) వలె మంచి పేరు తెచ్చుకుంటానో లేదో కానీ చెడ్డపేరు మాత్రం తీసుకు రానని చెప్పారు.
జగన్లా బలి చేయను
తాను జగన్లా ఓ వ్యక్తి చేత రాజీనామా చేయించి, బలి చేసి రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదని నారా లోకేష్ చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రతిపక్ష నేతలా ఒకరిని బలి చేయాలా అని ప్రశ్నించారు. అది సరికాదని అన్నారు.
మన గడ్డపై అసెంబ్లీ గర్వకారణం
ఈ రోజు మన గడ్డ పైన అసెంబ్లీని నిర్వహించుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందని లోకేష్ అన్నారు. భారత దేశంలో ఎక్కడై లేని విధంగా అసెంబ్లీని నిర్మించుకున్నామని తెలిపారు.
సర్పంచిగా పోటీ చేస్తా
ప్రజలను, ప్రభుత్వాన్ని అనుసంధానం చేసే అవకాశం తనకు వచ్చిందని లోకేష్ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవ చేస్తామని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకే తాను ఎమ్మెల్సీగా రంగంలోకి దిగానని చెప్పారు. పార్టీ అదేశిస్తే సర్పంచిగా అయినా పోటీ చేస్తానని చెప్పారు. అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని తెలిపారు.
మా ప్రభుత్వం చాలా చేసింది
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఎంతో చేసిందని లోకేష్ అన్నారు. పింఛన్లు అయిదు రెట్లు పెంచామని, రూ.200 ఉంటే రూ.1000 చేశామని చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని అధృష్టంగా భావించి, సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు.
మంత్రి పదవి.. సీనియర్లపై ఇలా..
మంత్రి పదవి, శాఖల పైన పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుందని లోకేష్ చెప్పారు. ఓ విలేకరి సీనియర్లతో పోల్చుతూ మాట్లాడగా.. తనను సీనియర్లతో పోల్చవద్దని, తన కంటూ ఓ పంథా ఉందని చెప్పారు.