TDP: "చినబాబు" ప్రకటనతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి??
వరుసగా మూడుసార్లు పోటీచేసి ఓటమిపాలైనవారికి ఈ సారి ఎన్నికల్లో సీటిచ్చేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించడంతో ఆ పార్టీ సీనియర్లలో గుబులు మొదలైంది. అంతేకాకుండా 40 శాతం సీట్లు యువతకే కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించాలనుకున్నా ప్రజలతో మమేకమైన తిరుగుతున్నవారికే సీట్లు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

వరుసగా 3 సార్లు ఓటమి పాలైతే సీటు లేదు
వరుసగా మూడుసార్లు ఓటమి పాలవడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొననివారిని కూడా సీట్ల కేటాయింపు నుంచి తప్పించేస్తున్నట్లు మహానాడు సమయంలో లోకేష్ ప్రకటించారు. దీంతో పలువురు సీనియర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. డోన్ నియోజకవర్గంలో కూడా కేఈ సోదరులు పార్టీలో పనిచేయకుండా, ఆర్థికంగా ఆసరా అందించకుండా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఉద్దేశంతోనే సుబ్బారెడ్డికి టీడీపీ సీటును చంద్రబాబు ప్రకటించారు. ఒక్కసారిగా కేఈ సోదరులకు షాక్ తగిలినట్లయింది.

ప్రత్యర్థులకు సహకరించినా తమకు ఇబ్బంది లేదు
వరుసగా మూడు సార్లు ఓడిపోయిన నేతలు వేళ్లమీద లెక్కింపతగ్గ సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ ఈ సారి సీటు లేదని స్పష్టమైంది. సీటు రాలేదని పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యర్థులకు సహకరిస్తామన్నా తమకు ఇబ్బంది లేదని, సీటిచ్చేది మాత్రం లేదని లోకేష్ అంతర్గతంగా కూడా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మహానాడులో శ్రీకాకుళం నుంచి అనంతంపురం వరకు, తెలంగాణ నేతలు కూడా లోకేష్తో మాట్లాడటానికి ఎక్కువ సమయం వెచ్చించడాన్ని బట్టి పార్టీలో అంతా తానే సంకేతాలు అతను పంపకుండానే పంపినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీ బలపడాలంటే కఠిన నిర్ణయాలు తప్పదు!
పార్టీని బలోపేతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవాలనంటే తన ఏజ్ గ్రూప్ వారు పార్టీలో తక్కువగా ఉన్నారని, సీనియర్లతో పంచుకున్నప్పటికీ ఒక జూనియర్గా తమ అభిప్రాయాలకు విలువ ఉండటంలేదని, ఆదేశాలున్నా వాటిని పాటించరని లోకేష్కు అర్థమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అందుకనుగుణంగా తన ఏజ్ గ్రూప్ వారు, సీనియర్ల వారసులు, యువతను రంగంలోకి దింపాలని, వారైతే ఉత్సాహంగా, దూకుడుగా పనిచేస్తారని, వైసీపీకి ఇటువంటివారే కావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని లోకేష్ అంటున్నారు. మరి సీనియర్లు ఏమంటారో???












Click it and Unblock the Notifications