చినజీయర్ ప్రవచనాల్లోనూ ఏపీ రోడ్ల దుస్ధితి-నారా లోకేష్ సెటైర్లు
ఏపీలో రోడ్ల దుస్ధితిపై ఇప్పటికే రాష్ట్రంలో విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు ఇదే కోవలో చిన్నజీయర్ స్వామి కూడా ఏపీలో తన పర్యటన సందర్భంగా రోడ్లపై ఎదురైన అనుభవాన్ని తన అధ్యాత్మిక ప్రసంగంలోనే చెప్పేశారు. దీంతో ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలు ఏపీలో విపక్షాలకు ఆయుధంగా మారాయి.
ఏపీలో జంగారెడ్డి గూడెం నుంచి రాజమండ్రి రావడానికి తనకు 3 గంటలు సమయం పట్టిందని, ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉంటాయని, ఈ రోడ్డు ప్రయాణం తనకో జ్ఞాపకంగా మిగిలిపోనుందని చిన్నజీయర్ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఏపీ రోడ్లపై చిన్నజీయర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. గతంలో ప్రజలు చెప్పారు, కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు చిన్నజీయర్ చెప్పారంటూ ఓ ప్రకటనలో ఏపీ రోడ్ల దుస్ధితిపై లోకేష్ విమర్శలు చేశారు.
"రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. పక్కరాష్ట్ర పాలకులు అధ్వాన పాలనకి ఉదాహరణగా మన ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వ స్పందన శూన్యం. రాజకీయాలకు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి దగ్గర, హిందూ ధర్మ ప్రచారమే జీవితలక్ష్యంగా సాగుతోన్న చిన జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారు. గతుకులు-గుంతలు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే.. జంగారెడ్డి గూడెం నుంచి రాజమహేంద్రవరం వరకూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుందని రోడ్ల దుస్థితిని భక్తులకు చెబుతున్నట్టే ప్రవచనంలో భాగంగానే వ్యాఖ్యానించడం చూస్తుంటే..జగన్రెడ్డి పాలనలో రహదారులు ఎంత దారుణంగా వున్నాయో స్పష్టం అవుతోంది." అంటూ నారా లోకేష్ ఓ ప్రకటనలో విమర్శలు గుప్పించారు.