రాజధానిలో లోకేష్ ప్రైవేట్ పర్యటన: మీడియాను అడ్డుకోవడంపై అనుమానాలు
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రాజధాని భూముల్లో పర్యటించారు. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ అనంతరం వారికి నిడమర్రులో రాజధాని భూములను చూపించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రాజధాని భూముల్లో పర్యటించారు. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ అనంతరం వారికి నిడమర్రులో రాజధాని భూములను చూపించారు.
మీడియాను అడ్డుకున్నారు..
కాగా, ఈ విషయాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను లోకేష్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం గమనార్హం. ఫొటోలు, వీడియోలు తీయొద్దని సూచించారు. ఇది మంత్రి లోకేష్ ప్రైవేటు పర్యాటన అని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.
అనుమానాలు
నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో లోకేష్ ప్రైవేటు పర్యాటన ఏంటన్న అనుమానాలు వ్యక్తం చేశారు పలువురు స్థానికులు. మీడియాను అడ్డుకోవడం చర్చకు దారితీసింది. కాగా, నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన అసెంబ్లీ భవనం డిజైన్ కు సీఎం చంద్రబాబునాయుడు బుధవారం ఆమోదం తెలిపారు.
సీఎంకు ప్రజెంటేషన్..
అయితే, హైకోర్టు భవనం డిజైన్పై ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోస్టర్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు దీనిపై పలు సూచనలు చేశారు. నార్మన్ ఫోస్టర్ బృందం వెలగపూడి సచివాలయంలో సీఎంకు తుది డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చింది.
నేడే తుది నిర్ణయం
శాసనసభ, హైకోర్టు భవనాల అంతర్గత నిర్మాణ ప్రణాళిక బాగుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ శాసనసభ భవనాన్ని వజ్రాకృతిలో, హైకోర్టు భవనాన్ని బౌద్ధ స్థూపాకారంలో డిజైన్ చేసింది. వీటిలో శాసనసభ భవన ఆకృతిని గురువారం శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, అందుబాటులో ఉన్న ఇతర మంత్రులకు చూపించి, వారి అభిప్రాయాలు తీసుకున్నాక ఖరారు చేద్దామని చెప్పారు. ఇందుకోసం గురువారం ఉదయం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.