బ్రాహ్మణి స్పీచ్ అదుర్స్: భార్యను చూసి నారా లోకేష్ నేర్చుకుంటారా?
ప్రసంగంలో నారా లోకేష్ కన్నా ఆయన సతీమణి నారా బ్రాహ్మణి చాలా మెరుగు అనే మాట వినిపిస్తోంది. అందుకు ఆమె ఇటీవలి ఢిల్లీ ప్రసంగాన్ని ఉదహరిస్తున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రసంగాలపై తీవ్రమైన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన ఏదో మాట్లాడాలని అనుకుని మరోటి మాట్లాడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలోనైతే ఆయన ప్రసంగ పాఠవం గురించి జోకులు పేలుతున్నాయి. ఆయనకు గిట్టనివారు, ప్రతిపక్షాలవాళ్లు ముద్దుపేర్లు కూడా పెట్టేస్తున్నారు. మంత్రిగారి వాక్చాతుర్యానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమీ చేయలేక, నోరు విప్పడం లేదు.
అయితే, నారా లోకేష్ సతీమణి, హీరో బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి మాత్రం ప్రసంగాల ద్వారా అదరగొడుతున్నారు. ఆమె రాజకీయాల్లోకి రానని చెప్పారు గానీ వస్తే ఎలా ఉంటుందనేది కూడా సూచాయగా ఆమె తాజా ప్రసంగం తెలియజేస్తోంది. బ్రాహ్మణి చూసి నారా లోకేష్ నేర్చుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.
రోజా ఆయనకు పేరు పెట్టారు...
నారా లోకేష్ ప్రసంగాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్కు పప్పు అనే పేరు పెట్టేశారు. నారా లోకేష్కు మాట్లాడడం చేత కాదనే విషయాన్ని ఆమె అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రోజా మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో గానీ అలా తప్పేమిటని సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అనేశారు.
బ్రాహ్మణి తన స్పీచ్తో అదరగొట్టారు...
మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి మాత్రం తన ప్రసంగం ద్వారా అదరగొట్టారు. హెరిటేజ్ కంపెనీ నిర్వహిస్తున్న ఆమె తన కంపెనీ గురించి ఏ మాత్రం తడబాటు లేకుండా, చాలా సునాయసంగా మంచి ప్రసంగం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించిన హెరిటేజ్ ఉత్పత్తుల మార్కెట్ను ఉత్తరాదికి విస్తరించే క్రమంలో ఆమె ఓ ప్రసంగం చేశారు. అందులో భాగంగా ఆమె ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు.
తన సంస్థ ఘనత గురించి....
పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఢిల్లీ కార్యక్రమంలో ఆమె చాలా బాగా మాట్లాడారు. హెరిటేజ్ సంస్సథ బోర్డు డైరెక్టర్గా ఆమె ఆ ప్రసంగం చేసారు. తమ సంస్థ లక్ష్యం హెల్త్ అండ్ హ్యాపినెస్ అని చెప్పారు. ప్రతి ఇంటికీ గ్లాసుడు పాలు నవ్వుతూ అందించడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. ఇలా చేయడం ద్వారా ప్రతి ఇంటిలో ఆరోగ్యం వెల్లివిరుస్తుందని చెప్పారు.
బ్రాహ్మణి ప్రసంగానికి కరతాళ ధ్వనులు...
నాణ్యతే తమ ప్రధాన లక్ష్యమని బ్రాహ్మణి చెప్పారు. రోజుకు 28 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. బ్రాహ్మణి ప్రసంగానికి పారిశ్రామికవేత్తల నుంచి కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. బ్రాహ్మణిని చూసైనా నారా లోకేష్ నేర్చుకుంటారా అని అడిగే పరిస్థితి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.