మోడీతో నరసింహన్ భేటీ, ఢిల్లీలో బిజీ: హైకోర్టు విభజన ఎజెండా?
న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో భేటీలతో బిజీగా గడిపారు. హైకోర్టు విభజనే ఎజెండాగా ఆయన భేటీలు కొనసాగుతున్నట్లు సమాచరాం. న్యాయమూర్తుల కేటాయింపు, తదితర అంశాలపై ఆయన చర్చలు జరుపుతున్నట్లు భావిస్తున్నారు.
ప్రధాని మోడీతో నరసింహన్ సోమవారం సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. మోడీతో భేటీ అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వచ్చినందునే మోడీని కలిశానని చెప్పారు.

తెలంగాణ, ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. కృష్ణా జలాల పంపకాల విషయాన్ని కేంద్రం చూసుకుంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి, న్యాయశాఖ మంత్రులతో కూడా ఆయన సమావేశమయ్యారు. హోంశాఖ కార్యదర్శితో కూడా ఆయన సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే తాను వారిని కలిసినట్లు గవర్నర్ చెప్పారు.
రేపు మంగళవారంనాడు కూడా గవర్నర్ ఢిల్లీలోనే ఉంటున్నారు. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతున్న నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications