'ఎస్కేప్' ఛాన్స్ లేకుండా: విస్తుపోయే ప్లాన్! నారాయణరెడ్డి హత్య జరిగిందిలా..(ఫోటోలు)
ట్రాక్టర్ ఢీకొట్టిన తర్వాత నారాయణ రెడ్డి కారు ఒక గుంతలో ఇరుక్కుపోయింది. ఇది కూడా ముందస్తు ప్లాన్ లో భాగమే. ఫార్చునర్ కారు అద్దాలను బండరాళ్లతో ధ్వంసం చేసి, ఆపై హత్యకు పాల్పడ్డారు.
కర్నూలు: కర్నూల్ జిల్లాలోని పత్తికొండ మరోసారి రక్తసిక్తమైన సంగతి తెలిసిందే. 1978నాటి నుంచి ఈ నియోజకవర్గంలో వైరి వర్గాల మీద దాడులు జరుగుతూనే వస్తున్నాయి. తాజాగా ప్రత్యర్థులు జరిపిన దాడిలో వైసీపీ ఇంచార్జీ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణంగా హత్యకు గురయ్యారు.
పత్తికొండ రక్తచరిత్ర: 1978 నుండి 14 మంది హత్య, ఆధిపత్యపోరే కారణమా?
పక్కా ప్లాన్ తో.. నారాయణరెడ్డిని మట్టుబెట్టడానికి దుండగులు రంగంలోకి దిగారు. ఎక్కడా తప్పించుకునే వీలు లేకుండా అంతా ఒక పథకం ప్రకారం హత్యకు స్కెచ్ గీశారు. దాడిలో మూడు ట్రాక్టర్లు వినియోగించారని, 25మంది వరకు వ్యక్తులు పాల్గొని ఉంటారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
రోడ్డు విస్తరణ పనులతో:
చెరుకులపాడు నుంచి రామకృష్ణాపురం గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కల్వర్టు పనులు జరుగుతుండటంతో.. వాహనాలన్ని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్తున్నాయి. పక్కకు వెళ్లేందుకు అసలు దారి లేదు.
కల్వర్టు పనుల నేపథ్యంలో.. అక్కడ ఉన్న రెండు కల్వర్టు పైపుల్లో 10మంది వరకు ప్రత్యర్థులు అప్పటికే మాటు వేసి ఉన్నారు. వాహనంలో వెళ్తున్నవారు వీరిని గమనించే అవకాశం లేదు. కల్వర్టుకు సమీపంలో ఉన్న బెండ తోటలో మరో ఐదుమంది వరకు దాక్కున్నారు.
కల్వర్టు సమీపంలోని పొలంలో:
కల్వర్టు దాటి కొంచెం ముందుకు పోయిన తర్వాత కుడివైపున ఒక పొలం ఉంది. ఈ పొలం లోపల ట్రాక్టర్ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ ట్రాక్టర్ పనులు ప్రత్యర్థి వర్గం ప్లాన్ చేయించినదే. ట్రాక్టర్ పనులు చేస్తున్నట్లుగా భ్రమ పడేలా.. అక్కడే 10మంది వ్యక్తులను పెట్టారు. అదీగాక, పక్కన్నే రోడ్డు విస్తరణ పనులు కూడా జరుగుతుండటంతో.. నారాయణ రెడ్డి వర్గం కూడా వాళ్లంతా పనుల కోసం వచ్చినవారే అనుకున్నారు.
తొలుత బండరాళ్లతో దాడి:
నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కల్వర్టు దాటుతున్న సమయంలోనే.. ప్రత్యర్థి వర్గం బండరాళ్లతో దాడికి దిగింది. తొలుత నారాయణరెడ్డి అనుచరులు వెళ్తున్న వాహనంపై ఈ దాడి జరిగింది. ఆపై కల్వర్టు దాటుతున్న సమయంలో.. నారాయణరెడ్డి కారును ఒక ట్రాక్టర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
తప్పించుకోకుండా ప్లాన్:
వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టగానే.. కారు పక్కనే ఉన్న పొలంలోకి వెళ్లే అవకాశం ఉండటంతో.. అప్పటికే మరో ట్రాక్టర్ ను ఎదురుగా తీసుకొచ్చి మరోసారి కారును ఢీకొట్టారు. కారును కదలకుండా చేసిన తర్వాత.. పొలంలోను, కల్వర్టు పైపుల్లోను దాక్కున్నవారంతా ఒక్కసారిగా వేటకొడవళ్లు. కత్తులతో విరుచుకుపడ్డారు.
ట్రాక్టర్ ఢీకొట్టిన తర్వాత నారాయణ రెడ్డి కారు ఒక గుంతలో ఇరుక్కుపోయింది. ఇది కూడా ముందస్తు ప్లాన్ లో భాగమే. ఫార్చునర్ కారు అద్దాలను బండరాళ్లతో ధ్వంసం చేసి, ఆపై హత్యకు పాల్పడ్డారు. నారాయణరెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన సాంబశివుడిని హత్య చేసిన తర్వాత దుండగులు చెరుకులపాడు వైపు పారిపోయారని సమాచారం.