సురేఖ చేరగా లేనిది, పవన్ కళ్యాణ్ ఏమిటో: నారాయణ
హైదరాబాద్: కాంగ్రెసుతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలనే తమ నిర్ణయాన్ని సమర్థించునకోవడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విచిత్రమైన వాదనను ముందుకు తెచ్చారు. మాజీ మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరగా లేనిది తాము కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. కొండా సురేఖ దంపతులు తెరాసలో చేరడం ఫిరాయింపులకు పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. కమ్యూనిస్టు భావాలున్న పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని ఎందుకు కలిశారో కూడా అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెసుతో సిపిఐ, తెరాస కలిసి పోటీ చేయాల్సి ఉందని, అయితే అది సాధ్యమయ్యేలా కనపించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసుతో తమకు పొత్తు కుదిరితే తాము 12 శాసనసభా స్థానాలు, ఒక్క లోకసభ సీటు అడుగుతామని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా తాము కాంగ్రెసుకు వ్యతిరేకమే గానీ తెలంగాణలో కాదని ఆయన అన్నారు. విభజన జరిగిన తర్వాత రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. నూతన తెలంగాణ ఏర్పాటుకు తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోతే మళ్లీ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు అనుకూలంగా సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. కాంగ్రెసును తోడేళ్లన్న కెసిఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని ఆయన శనివారం మీడియాతో అన్నారు. రాష్ట్ర విభజన చట్టబద్దంగానే జరిగిందని, ఇతర విషయాల్లో విభజన జరగాల్సి ఉందని ఆయన అన్నారు. పోలవరంపై తమ అభిప్రాయాన్ని కెసిఆర్ స్పష్టం చేశారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications