నారాయణరెడ్డి హత్య: బెంగళూరు కేంద్రంగా స్కెచ్, పక్కా ప్రణాళిక, రెక్కీ కూడా..
నారాయణ రెడ్డి హత్యోదందం యావత్తూ పకడ్బందీగా జరిగినట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా నెల రోజుల ముందునుంచీ ఆయన హత్యకు ప్రత్యర్థులు పథక రచన సాగించినట్టు, 15 రోజుల ముందు నుంచి రెక్కీ కూడా నిర్వహించినట్
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పత్తికొండ నియోజకవర్గ ఇన్ ఛార్జి చెరకులపాడు నారాయణ రెడ్డి హత్యోదందం యావత్తూ పకడ్బందీగా జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల ముందునుంచీ ప్రత్యర్థులు ఆయన హత్యకు పథక రచన సాగించినట్టు సమాచారం. మొత్తం కథంతా బెంగళూరు కేంద్రంగా నడిచినట్లు చెప్పుకుంటున్నారు.
నారాయణరెడ్డి హత్యకు 15 రోజుల ముందు నుంచి రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండే వారెవరూ ఇంత పకడ్బందీగా హత్యకు స్కెచ్ వేసే అవకాశం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.
అత్యధికులు యువకులే...
చెరకులపాడు నారాయణ రెడ్డి హత్యోదంతంలో పాల్గొన్న వారిలో అత్యధికులు యువకులే ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఎంచి మరీ అధికారపార్టీ నాయకులు సమీకరించినట్లు వైయస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా వ్యవహారాలలో పెద్ద మొత్తంలో ఆదాయం ఆర్జిస్తున్న యువకులే ఎక్కువ మంది నారాయణరెడ్డి హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్నారని సమాచారం.
ఇసుక తవ్వకాలు ఆపివేయించారనే...
ఇసుక తవ్వకాలపై హైకోర్టులో విచారణ జరుగుతుండడం, తవ్వకాలు ఆగిపోవడంతో వీరి ఆదాయానికి గండిపడిందని, కేసు వేసిన వారి వెనుక నారాయణరెడ్డి ఉన్నారన్న అపోహతో వారు ఆయనపై కక్ష పెంచుకున్నారని వినిపిస్తోంది. అటువంటి వారందరినీ సమీకరించి నారాయణరెడ్డిపై ఎగదోయడంలో తెలుగుదేశం నాయకులు సఫలమయ్యారని, వారే హత్యకు స్కెచ్ నుంచి అన్నీ సమకూర్చారని వైయస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
వారి కాల్ డేటా పరిశీలిస్తే...
ఈ హత్య అనంతరం ఆ ఘటనలో పాల్గొన్న పలువురు యువకులు.. కొద్ది మంది నేతలకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనుమానితుల కాల్ డేటాను పరిశీలిస్తే హత్య వెనుక సూత్రధారుల వివరాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నారాయణ రెడ్డి హత్య అనంతరం కొన్ని గ్రామాల్లో కొద్ది మంది సంబరాలు చేసుకున్నారని, దీనిపై కూడా పోలీసులు కూపీ లాగితే కేవలం సంఘటనలో పాల్గొన్న వారే కాకుండా వెనుక ఉండి చేయించిన వారి వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
కల్వర్టు నిర్మాణం ఎందుకు ఆపారు?
నారాయణరెడ్డి హత్యకు పథక రచన పక్కాగా జరిగిందనడానికి కల్వర్టు పనుల నిలిపివేత కూడా నిదర్శనంగా నిలుస్తోంది. ఆదివారం నారాయణరెడ్డి ఈ దారిలో వెళతారని పసిగట్టిన ప్రత్యర్థులు భారీ పథకాన్నే రచించారు. ఆదివారం ఇక్కడ జన సంచారం తక్కువగా ఉంటుంది. ఇక్కడ రోడ్డు, కల్వర్టు పనులు కూడా జరగవు. పైగా, ఇక్కడ పైపులు ఉండటం వల్ల దాడి సులువు అవుతుంది. బాధితులు తప్పించుకునే కూడా అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే, అంతకు నాలుగు రోజుల ముందే రోడ్డు, కల్వర్టు పనులు నిలిచిపోయాయి. పథకంలో భాగంగానే ఈ పనులు నిలిపివేశారని నారాయణ రెడ్డి అనుచరులు అంటున్నారు.
రెక్కీ నిర్వహించి.. ఆపైన..
ఒకవేళ కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతుంటే దాడికి అవకాశం ఉండేది కాదు. భారీ స్కెచ్తో దాడికి దిగాలంటే ముందుగా రెక్కీ నిర్వహించాల్సిందే. ఇక్కడ పనులు జరుగుతుంటే రెక్కీకి అవకాశం ఉండదు. అందువల్లే దాడికి నాలుగు రోజుల ముందునుంచే పనులు నిలిపివేయించి, రెక్కీ నిర్వహించారని చెబుతున్నారు. ఇక్కడ ఉన్న పైపులను ఆసరాగా చేసుకొని దాడికి పాల్పడ్డారని అంటున్నారు. పనులు నిలిచిపోవడంతో దాడి చేసిన వారు పైపుల్లో, వాటి వెనుక నక్కి ఉండే అవకాశం కలిగింది. అందువల్లే ఈ ప్రాంతాన్ని ఎంచుకొని, ముందుగానే పనులు నిలిపివేయించారని, దీనిపై కూడా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉందని నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.