చిన్నారుల హత్య కేసు: నిందితుడు బాబాయ్ ఆత్మహత్య
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు చిన్నారుల హత్య కేసులో నిందితుడు నరేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. బాసర వద్ద గోదావరి నదిలో నరేందర్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ముగ్గురు చిన్నారులను హత్య చేసి, కాల్చివేసిన విషయం తెలిసిందే. నిందితుడు చిన్నారులకు బాబాయ్ అవుతాడు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండు రోజుల క్రితం చిన్నారులను చంపిన సమయంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని బంధువులకు ఫోన్ చేసి హెచ్చరించిన విషయం తెలిసిందే. హెచ్చరించినట్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. బాసర వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గోదావరి వంతెన గోడపై పసుపు పచ్చ టి షర్ట్ ధరించిన ఒక వ్యక్తి కూర్చున్నాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. అతను చిన్నారులను చంపిన చోటనే కారు, చెప్పులు వదిలి పరారయ్యాడు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేశారు.
దారుణానికి కారణం ఏమిటి?
నిజామాబాద్లో ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న నరేందర్ రెడ్డికి వివాహం కాలేదు. దీంతో కొంత కాలంగా అతను సైకోలా వ్యవహరిస్తున్నాడంటున్నారు. మరోవైపు, నరేందర్రెడ్డి, అతని సోదరుడు రాజిరెడ్డి ఇద్దరూ మానసిక రోగులేనని బంధువులు చెబుతున్నారు. రాజిరెడ్డి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతుండగా అతనికి కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు.