హోదాపై తేల్చేద్దాం!: 2న మోడీ ప్రకటన, అమిత్ షా చర్చల్లో వెంకయ్య ఒత్తిడి
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏదో ఒకటి తేల్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందా? హోదా కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో నిర్దిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కల్పించే విషయమై పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించినప్పటికీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, తిరుపతిలో పవన్ నిర్వహించిన బహిరంగ సభతో కదలిక మొదలైనట్టు కనిపిస్తోంది.
ప్రత్యేక హోదా అంశం ప్రజల సెంటిమెంట్గా మారడం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హోదా గోదాలోకి దిగడంతో ఈ అంశంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ తర్వాత ఏపీకి హోదాపై రాష్ట్రంలో వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. దీంతో అటు రాష్ట్ర ప్రభుత్వంపైనా, ఇటు కేంద్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తైనప్పటికీ, ఈ విషయాన్ని మరింతగా సాగదీయడం మంచిది కాదని భావించిన బీజేపీ మరో రెండు రోజుల్లో ప్రత్యేక హోదాపై కీలక ప్రకటన చేయనుంది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అంతకు ముందురోజు అంటే సెప్టెంబరు 2నే ఇందుకు సంబంధించి మోడీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీకి హోదాతో పాటు, విభజన సమయంలో ఇచ్చిన హామీలపైనా కూడా ఆయన స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇదే విషయమై సోమ, మంగళవారాల్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కేంద్రం చేసే ప్రకటన ఎలా ఉండాలన్న దానిపైనే ఈ సందర్భంగా ప్రధానంగా దృష్టి సారించారు.

తన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించిన వెంకయ్య
హోదా అంశంతో పాటు ఏపీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలన్నింటిపైనా ఈ సందర్భంగా వెంకయ్య తన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించినట్లు తెలిసింది. మరోవైపు ప్రత్యేక రైల్వే జోన్తో సహా విభజన చట్టంలోని వివిధ హామీలకు ఆ ప్రకటనలో నిర్దిష్ట స్థానం కల్పించాలని అమిత షా సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా, ప్యాకేజీలకు సంబంధించిన ఐదు పేజీల ముసాయిదాను కేంద్ర మంత్రి సుజనా చౌదరి మంగళవారం జైట్లీకి అందజేశారు. హోదాపై న్యాయ నిపుణుల సలహాలు ఏమిటి? ప్రకటన ఎలా ఉండాలి? ప్యాకేజీ ఏ మేరకు ఉండాలి? విభజన చట్టంలోని ఇతర హామీల అమలుకు చేపట్టాల్సిన చర్యలేమిటి? అనే అంశాలను ఆ ముసాయిదాలో పొందుపరిచారు.

ఆలస్యం అయ్యే కొద్దీ శత్రువులను పెరుగుతారు
ఈ ముసాయిదాకు అమిత షా నేతృత్వంలోని బృందం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రధానితో కూడా చర్చించిన తర్వాత ముసాయిదా ఆధారంగా రూపొందించే ‘ప్రత్యేక' ప్రకటనకు తుది రూపు ఇవ్వాలని అమిత్ షా భావిస్తున్నారు. ప్రత్యేక హోదాపై జాప్యం అనవసరమని మంగళవారం నాటి చర్చల సందర్భంగా అమిత్ షా అభిప్రాయపడినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించిన అమిత్ షా, ఆలస్యం అయ్యే కొద్దీ శత్రువులను పెంచుకోవడం మినహా పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు.

ఎదురయ్యే రాజకీయ సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడం వల్ల ఇతర రాష్ర్టాల నుంచి ఎదురయ్యే రాజకీయ సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారట. ఏపీకి హోదా అంశంపై మంగళవారం ప్రత్యేక హోదా, ఇతర హామీల అమలుకు సంబంధించి గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో చర్చలు జరిపారని తెలిపారు. ఆయన చేసిన సూచనల మేరకు మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, తాను భేటీ అయ్యామని వివరించారు.

ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణానికి నిధులు, రైల్వే జోన్
ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణానికి నిధులు, రైల్వే జోన్ ఏర్పాటు సహా విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిపైనా చర్చించామని తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, సభ సాక్షిగా చేసిన హామీలు ఏమేమి ఉన్నాయి? వాటిని ఎలా అమలు చేయాలి? అనే వాటిపై దృష్టి సారించామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని ఎలా అధిగమించాలి? అన్న అంశాలపై దృష్టి సారించామని తెలిపారు. ఈ చర్చల మేరకు ఒక ముసాయిదా నివేదికను తయారు చేశారని, దీనిపై న్యాయ సలహా కూడా తీసుకుని త్వరలోనే ప్రకటన చేసే అవకాశముందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications