తెలుగు రాష్ట్రాలంటే మోడీకి అభిమానం, తిప్పికొడతాం: చంద్రబాబుపై జీవీఎస్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు అంటే ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహా రావు ఆదివారం చెప్పారు. ఏపీలో నెంబర్ వన్గా బీజేపీ ఎదిగేందుకు వ్యూహరచన చేస్తున్నామని చెప్పారు. తమపై గత కొంతకాలంగా రాజకీయ దుష్ప్రచారం సాగుతోందన్నారు.
తమ లోపాలు కప్పిపుచ్చుకునేందుకు తమపై టీడీపీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తమపై జరిగే అసత్య ప్రచారాన్ని తాము తిప్పికొడతామని చెప్పారు. ఏ పార్టీ కూడా మిత్రపక్షాన్ని దూరం చేసుకోవాలని అనుకోదని చెప్పారు.
అలాంటప్పుడు తమ పార్టీ టీడీపీని దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటుందని జీవీఎల్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎప్పుడైనా, ఏ అద్భుతమైన జరగవచ్చునని చెప్పారు. తమపై జరిగే అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామని చెప్పారు. రెండింతల నిధులు ఇచ్చామన్నారు.
గతంలో తమను (బీజేపీని) భూతద్దంలో చూపించే ప్రయత్నం చేసి, తాము ఎదిగేందుకు ఇతర పార్టీలు దోహదపడ్డాయని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా విపక్షాలన్నీ ఏకమయినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. తాను యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లినా తెలుగు రాష్ట్రాలపై, ప్రత్యేకంగా ఏపీపై దృష్టి సారిస్తానని చెప్పారు.