దొరకని మోడీ అపాయింట్మెంట్: కేరళ నుంచి కెసిఆర్ ఇటే..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. నిజానికి, జనవరి మొదటివారంలో ఆయన ప్రధాని మోడీని కలవాలని అనుకున్నారు. అందుకు ఆయన ఆదివారంనాడు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే, మోడీ ఏమీ చెప్పకపోవడంతో కెసిఆర్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. గత ఆరు నెలల కాలంలో మోడీకి, కెసిఆర్కు మధ్య సుహృద్భావ వాతావరణంలో ముఖాముఖి భేటీ జరిగిన సందర్భాలు లేవు.
నిరుగు ఆగస్టులో కెసిఆర్ మోడీని ఫాసిస్టుగా అభివర్ణించారు. పైగా, తెలంగాణలో మజ్లీస్తో ఆయన దోస్తీ కుదుర్చుకున్నారు. మోడీని తాను ఫాసిస్టుగా అభివర్ణించలేదని కెసిఆర్ ఆ తర్వాత అన్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని అంటున్నారు. పైగా, మోడీ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్లడం లేదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. అదే విధంగా డిసెంబర్ 25వ తేదీన సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించలేదు.

మోడీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో కెసిఆర్ ఆదివారంనాడు వాటర్ గ్రిడ్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కేరళలో ఓ వివాహ వేడుకకు హాజరైన కెసిఆర్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లాల్సింది. నల్లగొండ జిల్లాలో 7,500 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు అనుమతి కోసం ప్రధాని మోడీని, ఇతర కేంద్ర మంత్రులను ఆయన కలవాలని అనుకున్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాను కోరడానికి, కాకతీయ మిషన్కు ఆర్థిక సాయం అర్థించడానికి ఆయన ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు.
అయితే, కేరళలో ఉండగా ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. అయితే, మోడీతో కెసిఆర్ సంబంధాలు ఆగస్టులో కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు అంటున్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటుకు ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి కెసిఆర్ హాజరు కావడం మోడీని సంతోషపెట్టిందని చెబుతున్నారు. కెసిఆర్ చేసిన చాలా సూచనలను నీతి ఆయోగ్ ఏర్పాటులో తీసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications