ప్రధాని కాకుండా మోడీని ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
మహబూబ్నగర్: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని దేశ ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మహబూబ్నగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సభ ప్రచార సభలా లేదని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార సభలా ఉందని అన్నారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనం అయిందని ఆరోపించారు. ఎక్కడా చూసిన అవినీతి పెచ్చరిల్లిందని అన్నారు. అవినీతి పాలన అంతం కావాలని అన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకుడా అని ప్రశ్నించారు. మోడీని చూస్తేనే ఉత్సాహం వస్తుందనీ, ఆయనే ప్రధాని అవుతారని చెప్పారు. గుజరాత్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మోడీ.. దేశాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెడతారని చంద్రబాబు అన్నారు.

అవినీతిని పూర్తిగా నిర్మూలించే వ్యక్తి నరేంద్ర మోడీనేనని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎన్డీఏ పవనాలు వీస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని, డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో విద్యుత్, ఉద్యోగ, నీటి సమస్యలు తీరాలంటే రాష్ట్రంలో బిజెపి-టిడిపి కూటమి, దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే ఎన్డీఏతోనే సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పారు. యువతకు ఉపాధి, మహిళలకు భద్రత కావాలన్న నరేంద్ర మోడీ పాలన దేశానికి అవసరమని చెప్పారు. రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. అందుకు బిజెపి-టిడిపి అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని చంద్రబాబు ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications