ఇంద్రకీలాద్రీపై నవరాత్రి ఉత్సవాలు.. ఏడోరోజు సరస్వతి అలంకరణలో అమ్మవారు..
బెజవాడ ఇంద్రకీలాద్రీపై నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడవ రోజున సప్తమి తిథి నాడు అమ్మవారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శమివ్వనున్నారు. నేడు సాధారణంగా మూలా నక్షత్రం వస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ పేర్కొన్నారు. ఆ రోజున అమ్మవారిని వాగ్దేవీ అలంకారంలో ఉపచారాలు చేస్తారని చిలకమర్తి వివరించారు.
మూలా నక్షత్రము రోజున మనమందరం అమ్మవారు శ్వేత పద్మాన్ని అధిష్టిస్తారు. వీణ, కమండలం, అక్షరమాలను ధరిస్తారు. సరస్వతి దేవీగా అవతరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులకు క్యూలైన్లలో నిలబడతారు. అర్థరాత్రి రెండు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. హోల్డింగ్ ఏరియాలలో ఉండే భక్తులను విడతల వారీగా క్యూలైన్లలో పంపుతున్నారు పోలీసులు.. నేటి (బుధవారం) రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శనం కొనసాగుతుంది. భక్తుల రద్దీని బట్టి మరో అరగంట వరకూ దర్శన సమయం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూల నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు..

సీఎం, డిప్యూటీ సీఎం సందర్శన..
దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేటి ఉదయం 9 గంటలకు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇక, మధ్యాహ్నం రెండుగంటల నుంచీ మూడు గంటల మధ్యలో కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పించనున్నారు సీఎం, డిప్యూటీ సీఎంల రాక కారణంగా సామాన్య భక్తుల దర్శనాన్ని ఎలాంటి ఆటంకం ఉండదని.. భక్తులకు యథావిథిగా దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయని అధికారులు వెల్లడించారు. అయితే, సాయంత్రం 4 గంటల తర్వాతే వీఐపీ దర్శనాలకు అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications